కట్టంగూర్, మే 10 : మండల కేంద్రంలో బుధవారం నుంచి ఈ నెల 31 వరకు స్వచ్ఛంద లాక్డౌన్ నిర్వహించాలని నిర్ణయించినట్లు ఎంపీపీ జెల్లా ముత్తిలింగయ్య తెలిపారు. సోమవారం కట్టంగూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ చెనగోని సతీశ్ అధ్యక్షతన జరిగిన పాలకవర్గం, వర్తక వ్యాపారస్తుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరిచి ఉంచాలని సూచించారు. ప్రజలు నిబంధనలు పాటించాలన్నారు. సమావేశంలో ఉప సర్పంచ్ అంతటి శ్రీను, పంచాయతీ కార్యదర్శి జయకర్, వార్డు సభ్యులు రెడ్డిపల్లి మనోహర్, పొడిచేటి సైదులు, కాపుగంటి గోపి, చెరుకు రామన్న, అంతటి నగేశ్, పొడిచేటి శ్రీకాంత్, మునుగోటి ఉత్తరయ్య, సైదులు, పాల్గొన్నారు.
ఆరెగూడెంలో..
చిట్యాల: మండలంలోని ఆరెగూడెం గ్రామం లో పాక్షిక లాక్డౌన్ విధిస్తూ పంచాయతీ పాలకవర్గం తీర్మానం చేసినట్లు సర్పంచ్ ఆరూరి లాలమ్మ తెలిపారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరువాలని, గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా ఎవరూ శుభకార్యాలు చేయవద్దని కోరారు. నిబంధనలు ఉల్లంఘిస్తే రూ. 2వేల జరిమానా విధించనున్నట్లు తెలిపారు.
నేటి నుంచి శాలిగౌరారంలో ..
శాలిగౌరారం : మండల కేంద్రంలో మంగళవారం నుంచి లాక్డౌన్ విధిస్తున్నట్లు సర్పంచ్ బట్ట హరితవీరబాబు తెలిపారు. ఈ మేరకు సోమవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో తీర్మానించినట్లు తెలిపారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దుకాణాలు తెరిచి ఉంటాయని ఆ తర్వాత బంద్ చేయాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఉప సర్పంచ్ గోదల సురేశ్రెడ్డి, వార్డు సభ్యులు, నాయ కులు పాల్గొన్నారు.
మాస్క్ ధరించాలి
శాలిగౌరారం : ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించాలని ఎంపీపీ గంట లక్ష్మమ్మ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆమె కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా మహమ్మారిని అంతమొందించేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నదన్నారు. ఆమె వెంట మండల వైద్యాధికారి వెంకన్న, ఆరోగ్య సిబ్బంది ఉన్నారు.
నిత్యావసరాల పంపిణీ
కేతేపల్లి : మండలంలోని కొత్తపేట గ్రామంలో కరోనాతో బాధపడుతున్న వారికి మాజీ ఎంపీటీసీ, నకిరేకల్ వ్యవసాయమార్కెట్ కమిటీ డైరెక్టర్ దాసరి సునీత సోమవారం నిత్యావసరాలు అందించారు. కొవిడ్ బాధితులు మనోధైర్యంతో ఉండాలని ఆమె సూచించారు.
అన్నెపర్తిలో 31 వరకు..
నల్లగొండ రూరల్, మే10 : మండలంలోని అన్నెపర్తి గ్రామంలో ఈ నెల 31 వరకు లాక్డౌన్ పాటించాలని గ్రామ పంచాయతీ తీర్మానం చేసినట్లు సర్పంచ్ మేకల అరవింద్రెడ్డి తెలిపారు. సోమవారం గ్రామంలో ఉపాధి కూలీలకు అవగాహన కల్పించారు. ఉదయం 10 గంటల వరకు దుకాణాలు తీసి ఉంటాయని, ఆ తర్వాత బంద్ చేస్తారని పేర్కొన్నారు. నిబంధలు పాటించకుంటే రూ.1000 జరిమానా విధిస్తామని హెచ్చరించారు. జ్వర లక్షణాలు ఉంటే ఇంట్లోనే ఉండి ఆరోగ్య సిబ్బంది అందించే మందులు వాడాలని సూచించారు.