కోల్ కతా : కొవిడ్-19 చికిత్సలో ఉపయోగించే మెడికల్ ఆక్సిజన్ సరఫరాలను పెంచాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోదీకి శుక్రవారం లేఖ రాశారు. బెంగాల్ లో ఉత్పత్తయ్యే ఆక్సిజన్ నుంచి ఇతర రాష్ట్రాల కోటాను కేంద్రం పెంచిందని తమ రాష్ట్రంలో ఆక్సిజన్ అవసరం అధిక మోతాదులో ఉన్నా తమకు కేటాయింపులు తక్కువగా ఉన్నాయని దీదీ ఆందోళన వ్యక్తం చేశారు.
బెంగాల్ లో రోజూ ఆక్సిజన్ వినిమయం 470 మెట్రిక్ టన్నులకు పెరిగిందని, రాబోయే రోజుల్లో ఇది 550 మెట్రిక్ టన్నులకు పెరగనుందని పేర్కొన్నారు. బెంగాల్ కు సత్వరమే రోజుకు 550 మెట్రిక్ టన్నుల మెడికల్ ఆక్సిజన్ సరఫరా చేయాలని అధికారులను ప్రధాని ఆదేశించాలని కోరారు. ఆక్సిజన్ సరఫరాలు ఏ కొద్దిగా తగ్గినా బెంగాల్ లో కరోనా రోగుల ప్రాణాలు కాపాడలేమని దీదీ ఆవేదన వ్యక్తం చేశారు.