మహారాష్ట్ర ప్రభుత్వం విద్య, ఉద్యోగరంగాల్లో మరాఠాలకు 16 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చేసిన చట్టం రాజ్యాంగ విరుద్ధమని భారత అత్యున్నత న్యాయస్థానం విస్పష్ట తీర్పునిచ్చింది. సమానత్వ స్ఫూర్తి ప్రకారం రిజర్వేషన్లు 50 శాతం పరిధిని దాటరాదని స్పష్టీకరించింది. సామాజికంగా బలీయమైన మరాఠాలకు రిజర్వేషన్లు ఏ విధంగా న్యాయసమ్మతమైనవో మహా ప్రభుత్వం సమర్థించుకోలేకపోయిందని పేర్కొన్నది. అలాగే కొన్ని సమూహాలను రిజర్వేషన్ల పరిధిలోకి తెచ్చే అధికారం రాష్ర్టాలకు లేదనీ, రాష్ట్రపతి ఆమోదంతో కేంద్రానిదేనని తేటతెల్లం చేయటం గమనార్హం. దీంతో మరాఠా కోటా విషయంలో రెండేండ్లుగా కొనసాగుతున్న న్యాయవివాదానికి తెరపడినట్లయింది. ఈ తీర్పు సందర్భంగానే ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీం ధర్మాసనం రిజర్వేషన్ల అమలులో అనేక మౌలికాంశాలను తడిమింది. రిజర్వేషన్ల కొనసాగింపులో, కోటా పెంపకంలో ఉన్న సంశయాలన్నింటికీ వివరణాత్మక తీర్పుతో సమాధానం ఇచ్చింది.
మరాఠాలకు విద్య, ఉద్యోగాల్లో 16 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం 1918లో చట్టం తెచ్చింది. కోటా చట్టాన్ని వ్యతిరేకిస్తూ పౌరసంఘ ప్రతినిధులు, స్వచ్ఛంద కార్యకర్తలు బాంబే హైకోర్టు తలుపు తట్టారు. దీనిపై 2019 జూన్లో సానుకూలంగా స్పందించిన కోర్టు, గైక్వాడ్ కమిషన్ సిఫారసుల ప్రాతిపదికన ఉద్యోగాల్లో 13 శాతం, విద్యాసంస్థల్లో 12 శాతానికి రిజర్వేషన్లను తగ్గించాలని నిర్దేశించింది. హైకోర్టు తీర్పుపై అసంతృప్తి చెందిన పౌరసంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఇప్పటికే తమిళనాడులో 1993 నుంచి 69 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. తెలంగాణ, గుజరాత్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలు కోటా పెంపు కోసం కేంద్రానికి విజ్ఞాపనలు పంపి ఉన్నాయి. తాజా తీర్పుతో మరాఠా కోటా కొట్లాటకు తెరపడినా, చాలారాష్ర్టాల రిజర్వేషన్కోటా అమలు, అభ్యర్థనల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.
రాజ్యాంగంలో రిజర్వేషన్ల కోటాకు పరిధి లేదు. సమాఖ్య స్ఫూర్తిని అనుసరించి నిర్దిష్ట సామాజిక, ఆర్థిక జీవన పరిస్థితుల ఆధారంగా ఆయా సమూహాల అభ్యున్నతికి తోడ్పాటునందించాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ప్రత్యేక పరిస్థితుల్లో కొన్ని సామాజిక సమూహాలకు రిజర్వేషన్ల కల్పన అవసరం రాష్ర్టాలకు ఏర్పడుతుంది. కానీ ఇప్పుడు రిజర్వేషన్ల కల్పనలో రాష్ర్టాల పాత్ర, ప్రమేయం లేకుండా పోతున్నది. వెనుకబడిన వర్గాల సంక్షేమానికి రిజర్వేషన్లే ప్రధానం, ప్రాతిపదిక కారాదు. విద్యా సంస్థలను పెంచి సంక్షేమానికి కట్టుబడి పనిచేయండి అన్న సుప్రీం తీర్పు ఆహ్వానించదగినదే. సామాజిక, ఆర్థిక అసమానతలు పోగొట్టే దిశగా ప్రభు త్వాలు కృషిచేస్తే రిజర్వేషన్ల ఆరాటం ఉండదు కదా! రాజకీయ ప్రయోజనాల కోసం రిజర్వేషన్ల రగడ ముందుకు రాకూడదు. ఈ దిశగా పార్టీలు, ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషిచేయాల్సి ఉన్నది.