హైదరాబాద్ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లలో కారు జోరు కొనసాగుతోంది. ఇప్పటికే జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్, అచ్చంపేట, సిద్దిపేట మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగురవేసిన టీఆర్ఎస్ పార్టీ.. ఈ రెండు కార్పొరేషన్లలోనూ అదే దూకుడు ప్రదర్శిస్తోంది. ఖమ్మం కార్పొరేషన్లో ఇప్పటి వరకు 44 డివిజన్ల ఫలితాలు వెలువడగా, ఇందులో టీఆర్ఎస్ పార్టీ 35 డివిజన్లలో గెలుపొందింది. ఖమ్మం కార్పొరేషన్లో మొత్తం డివిజన్ల సంఖ్య 60. గ్రేటర్ వరంగల్ పరిధిలో మొత్తం 66 స్థానాలకు గానూ 28 స్థానాల ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో టీఆర్ఎస్ 20 స్థానాల్లో గెలుపొందింది. మరికాసేపట్లో పూర్తి స్థాయి ఫలితాలు వెలువడనున్నాయి.