జమ్మికుంట,(జమ్మికుంట రూరల్), మే 2: ఈటల రాజేందర్ తప్పు చేసినట్టు మీడియా ముందు ఒప్పుకున్నాడని, కాబట్టి ఆయనను వెంటనే జైలు పంపించాలని కరీంనగర్ డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోల్నేని సత్యనారాయణరావు డిమాండ్ చేశారు. జమ్మికుంటలోని పద్మశాలి భవన్లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘ఈటల రాజేందర్ మొన్న ప్రెస్మీట్లో ఆరెకరాల అసైన్డ్ భూమిని కొన్నానని చెప్పిండు. కానీ 66 ఎకరాల అసైన్డ్ భూమి ఆక్రమించుకున్నాడని నివేదికలు చెప్తున్నాయి. మరి 60 ఎకరాలు కబ్జా చేశారా?’ అని ప్రశ్నించారు. ఈటలపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని కోరారు. ఈటల రాజేందర్కు జమ్మికుంటకు చెందిన ప్రముఖ వ్యాపారి బచ్చు భాస్కర్ బినామీగా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా మంత్రి బినామీలు ఎంతో మంది ఉన్నారని, వారి ఆస్తులపైనా విచారణ చేయాలని డిమాండ్ చేశారు.