హైదరాబాద్ సిటీబ్యూరో, మే 1 (నమస్తే తెలంగాణ): మంత్రి ఈటల, ఆయన కుటుంబసభ్యుల మరో భూదందా బయటపడింది. మేడ్చల్ జిల్లా శామీర్పేట మండలం ఉప్పర్పల్లి గ్రామంలో ఓ అమాయకుడైన దళిత రైతు భూమిని అన్యాయంగా లాక్కొని.. ఇదేమని అడిగినందుకు ఈటల అన్నకొడుకు వికాస్.. ఆడోళ్లని కూడా చూడకుండా కొట్టిచ్చారని ఉప్పర్పల్లి గ్రామానికి చెందిన ఓ దళిత కుటుంబం వాపోయింది. తమకు జరిగిన అన్యాయంపై మంత్రి ఈటలను పలుమార్లు కలిసి మొరపెట్టుకొన్నా.. దిక్కులేని చందంగా మారింది. ఎప్పుడు ఎవరు వచ్చి దాడిచేస్తారో తెలియని పరిస్థితిలో ఉన్న బాధితులు శనివారం రాత్రి బిక్కుబిక్కుమంటూ హైదరాబాద్లో ప్రగతిభవన్కు వచ్చి సీఎం కేసీఆర్కు ఫిర్యాదుచేశారు. ఈటల కుటుంబం నుంచి తమ భూమిని తమకు ఇప్పించాలని విజ్ఞప్తిచేశారు. ఉప్పర్పల్లి గ్రామానికి చెందిన బాలేశ్.. 2014 స్థానిక ఎన్నికల్లో శామీర్పేట జడ్పీటీసీగా పోటీచేశాడు. ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి డబ్బులు లేకపోవడంతో పోతారం పెంటారెడ్డి అనే వ్యక్తి మధ్యవర్తిగా.. దగ్గర్లో ఉన్న నారాయణపురం గ్రామానికి చెందిన బీ హరికృష్ణ దగ్గర రూ.20 లక్షలు అప్పు తీసుకొన్నాడు. ఇందుకోసం తనకు చెందిన ఏడు ప్లాట్లను హరికృష్ణ దగ్గర తనఖా పెట్టాడు. ఏమైందో కానీ.. నాలుగు రోజుల తర్వాత.. మధ్యవర్తిత్వం నెరపిన పెంటారెడ్డి బాలేశ్ దగ్గరకు వచ్చి హరికృష్ణకు ప్లాట్లు వద్దంట.. మరేదైనా ఆస్తి ఉంటే తనఖా పెట్టాలని.. లేదా డబ్బులు వాపస్ ఇవ్వాలని అడుగుతున్నాడని చెప్పాడు. దీంతో బాలేశ్ తన తల్లి పోలమోల్ల భాగ్యమ్మ పేరు మీద సర్వే నంబర్ 966 లో ఉన్న 1.28 ఎకరాల స్థలాన్ని హరికృష్ణ పేరిట మార్ట్గేజ్ చేశాడు. మరోవైపు హరికృష్ణ ఇచ్చిన రూ.20 లక్షలను మధ్యవర్తి పెంటారెడ్డి.. బాలేశ్కు ఇవ్వకుండా తానే ఎన్నికల్లో ఖర్చు పెడతానని తీసుకొన్నాడు. పెంటారెడ్డి ఖర్చుపెట్టాడో లేదో తెలియదు కానీ.. బాలేశ్ ఎన్నికల్లో గెలిచాడు.
ఎన్నికల్లో గెలిచిన బాలేశ్ అప్పు తీర్చడంలో ఆలస్యం చేయడంతో హరికృష్ణ తన దగ్గరున్న మార్ట్గేజ్ డాక్యుమెంట్ను అడ్డం పెట్టుకొని బాలేశ్కు, ఆయన తల్లికి తెలియకుండా శామీర్పేట మండల కార్యాలయంలో పట్టాదార్ పాస్పుస్తకాల కోసం దరఖాస్తు చేసుకొన్నాడు. విషయం తెలిసిన బాలేశ్.. పంచాయతీ పెట్టించి హరికృష్ణ డబ్బులు అతనికి ఇచ్చేట్టు.. తన భూమిని తనకు హరికృష్ణ అప్పగించేటట్టు ఒప్పందం చేసుకొన్నాడు. ఈ ఒప్పందాన్ని హరికృష్ణ ఖాతరుచేయకపోగా తాసిల్దార్ ఆఫీస్ నుంచి పాస్పుస్తకాలను పొందాడు. దీంతో ఆగ్రహించిన బాలేశ్ మళ్లీ పంచాయతీ పెట్టడంతో తన డబ్బులు తనకు తిరిగిస్తే.. భూమిని మళ్లీ బాలేశ్ తల్లి పేరిట పట్టాచేస్తానని నమ్మబలికాడు. ఇదే సమయంలో ఈటల రాజేందర్ అన్నకొడుకు ఈటల వికాస్ రంగంలోకి దిగాడు. పరిణామాలు చకచకా మారిపోయాయి. బాలేశ్ తల్లికి చెందిన 1.28 ఎకరాల భూమిని.. హరికృష్ణ.. ఈటల వికాస్ పేరిట రహస్యంగా రిజిస్ట్రేషన్ చేయించేశాడు.
తన భూమి వికాస్ పేరిట రిజిస్ట్రేషన్ చేయించిన విషయం తెలియని బాలేశ్.. పెద్దమనుషుల సూచన మేరకు రూ.20 లక్షల అప్పునకు.. రెట్టింపు మొత్తాన్ని హరికృష్ణకు చెల్లించాడు. హరికృష్ణ గుట్టుచప్పుడు కాకుండా డబ్బు తీసుకున్నాడే కానీ వికాస్కు రిజిస్ట్రేషన్ చేయించిన విషయాన్ని చెప్పలేదు. నాలుగు నెలలైనా భూమి అప్పగించకపోవడంతో బాలేశ్ విచారించగా వికాస్ ఎపిసోడ్ బయటపడింది.
తమకు జరిగిన అన్యాయంపై బాలేశ్, అతని కుటుంబసభ్యులు మంత్రి ఈటలను పలుమార్లు కలిసి, న్యాయంచేయాలని వేడుకొన్నారు. ‘మీకు జరిగింది అన్యాయమే.. మీకు న్యాయం జరుగాల్సిందే..’ అంటూ ఈటల తమ ముందు మొసలి కన్నీరు కార్చారే తప్ప.. న్యాయం మాత్రం చేయనేలేదని బాధితులు వాపోయారు. మంత్రి ఆదేశాలతో వికాస్తో పోలీసులూ చేతులు కలిపారని, తనపై అక్రమంగా కేసు పెట్టి జైలుకు పంపించారని బాలేశ్ ఆవేదన వ్యక్తంచేశారు.
దొడ్డి దారిన బాలేశ్ తల్లి భూమిని హరికృష్ణ వద్ద అతి తక్కువ ధరకే కొన్న వికాస్.. ఆ భూమిని స్వాధీనం చేసుకొనేందుకు మోకా మీదకు వచ్చాడు. అక్కడే ఉన్న బాలేశ్ తల్లి ‘నా కొడుకు చేసిన అప్పు ఇప్పటికే తీర్చిండు. మా భూమి మీదకు రావద్దు’ అని బతిమాలుకున్నారు. కానీ వికాస్ రెచ్చిపోయాడు. సినిమాల్లో ఫ్యాక్షన్ సీన్లలాగ.. వందమందిని వెంటేసుకొని వచ్చి ఆ భూమిలోని దొండచేనును ధ్వంసం చేశాడు. అడ్డుకున్న బాలమ్మ కోడలిని ఈడ్చి బయట పడేశారు. వారి చిన్న పిల్లలు తల్లిడిల్లేలా ఏడుస్తున్నా.. కనికరం చూపని వికాస్.. ఇక్కడి నుంచి వెళ్లిపోకుంటే చంపుతామంటూ బెదిరించాడు. ఓ వారం రోజుల కిందటివరకు ఉన్న శామీర్పేట సీఐ.. ఈటల ఆదేశాలమేరకు వికాస్ చేతిలో కీలుబొమ్మగా మారి తాను పోలీసుననే విచక్షణ కూడా మరిచి ప్రవర్తించాడు. వికాస్ మనుషులు ఆడవాళ్లను కొడుతుంటే అక్కడే ఉన్న సీఐ.. వాళ్లకు న్యాయం చేయకపోగా వికాస్కు అండగా నిలువటంపై బాధితులు ఆందోళన వ్యక్తంచేశారు.
‘అయ్యా ఓ అయ్యా.. మాకు ఈ భూమినే దిక్కయ్యా.. గా ఈటల రాజేందర్ అన్న కొడుకు మా పసి పిల్లల ముందే నా డొక్కల పిడి గుద్దులు గుద్దిండయ్యా.. నాకు ఆయాసం అవుతుంది.. లేవస్తలేదు.. మా ఆయనను ఉరేస్తానన్నడు. సీఐ సారు వాళ్లతోనే వచ్చాడు.. అయ్యా.. ఓ ఈటల రాజేందర్.. సీఐ కండ్లముందే కొట్టినా.. మీకు ఏడ రక్తం ఎల్తున్నది అని అంటున్నడు అయ్యా.. ఆ సీఐ వాళ్ల మనిషి. అయ్యా.. ఆయనతో మాకు ఏమీ న్యాయం జరుగలేదయ్యా.. మా ఫోన్లు గుంజుకొని.. మాపై దాడులు చేశాడు. అయ్యా.. ఈటల రాజేందర్ అన్న కొడుకు వికాస్ మా తోటను కత్తెర్లతో కోపిచ్చాడయ్యా.. మాకు ప్రాణభయం ఉన్నది. ఇప్పటికే నాలుగైదు సార్లు దాడులు చేశారు.. మమ్ములను మందుపోసి చంపుతానన్నడు.. నా కొడుకును ఉరిపెట్టి చంపుతానన్నడు, నా వెంట్రుకలు పట్టుకొని గొరగొర గుంజుకుపోయారు. సారూ.. చేతికి వచ్చిన పంటను మొత్తం కోసేశారు. మాకు జరుగుతున్న అన్యాయం శామీర్పేట మండల పెద్దలకు, గ్రామస్థులందరికీ తెలుసు. ఈటల రాజేందర్ అన్న కొడుకు ఎప్పుడు వచ్చినా.. వందమందితో వస్తాడు.. ఎప్పుడు పదిమందిని ఇక్కడే కాపలా పెడుతాడు. మమ్ములను ఎప్పుడు చంపుతారో ఏమో సారూ.. భయంగా బతుకుతున్నం.. అయ్యా ఈటల రాజేందరూ.. నా కుటుంబంలో అందరినీ చంపి మా భూములను తీసుకో నాయనా.’
పోలమోల్ల కర్రె భాగ్యమ్మ,
ఈటల వికాస్ బాధితురాలు పోలమోల్ల భాగ్యమ్మ అనే దళిత మహిళ.. తన కుటుంబసభ్యులతో కలిసి శనివారం రాత్రి ప్రగతిభవన్కు వచ్చిన, తన సమస్యపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. తన 1.28 ఎకరాల భూమిని ఈటల కుటుంబసభ్యులు బలవంతంగా ఆక్రమించుకున్నారని.. తన భూమిని తనకు తిరిగి ఇప్పించాలని సీఎంకు రాసిన లేఖలో కోకారు. 2014లో డబ్బు అవసరమై 20 లక్షలకు 1.28 ఎకరాలు తాకట్టు పెట్టి మళ్లీ ఆ రుణం తీర్చేలోపే ఈటల రాజేందర్ అన్న కొడుకు వికాస్ తమ భూమిని అన్యాయంగా ఆక్రమించాడని అందులో ఆరోపించారు. ఇదేమిటని నిలదీస్తే ఈటల అండ చూసుకొని ఆయన ఆనుచరులు తమపై దాడికి పాల్పడటమే కాకుండా తన కుమారుడిపై తప్పుడు కేసులు పెట్టించి జైలుపాలు చేశారని భాగ్యమ్మ ఫిర్యాదు చేశారు.