బ్యాంక్ ఎండీ, సీఈవో పదవీకాలాలకు పరిమితి విధించిన ఆర్బీఐ
వయసు 70 ఏండ్లు మించరాదనీ స్పష్టం
ముంబై, ఏప్రిల్ 26: దేశంలోని ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ), చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో), హోల్-టైం డైరెక్టర్ (డబ్ల్యూటీడీ)ల పదవీకాలం 15 ఏండ్లు దాటరాదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయం కొటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపక సీఈవో ఉదయ్ కొటక్ను ప్రభావితం చేయనున్నది. 2003 నుంచి ఆయనే కొనసాగుతున్నారు. ఇక ఈ హోదాల్లోని వారి వయసు 70 ఏండ్లకు మించరాదని కూడా సోమవారం స్పష్టం చేసింది. అయితే 15 ఏండ్ల కాలపరిమితి ముగిసిన తర్వాత కూడా అదే బ్యాంక్లో ఎండీ, సీఈవో, డబ్ల్యూటీడీ హోదాలకు అర్హత ఉంటే మూడేండ్ల విరామం తర్వాత షరతులకు లోబడి వారిని మళ్లీ నియమించుకోవచ్చని ప్రకటించింది. కానీ ఈ మూడేండ్ల సమయంలో సదరు వ్యక్తికి బ్యాంక్తోగానీ, దాని అనుబంధ సంస్థలతోగానీ ప్రత్యక్షంగానైనా, పరోక్షంగానైనా ఎలాంటి సంబంధాలు ఉండరాదని తెలిపింది. ఇక అవసరమైతే ఎండీ, సీఈవో, డబ్ల్యూటీడీల రిటైర్మెంట్ పదవీకాలాన్ని తగ్గించుకునే అధికారం కూడా బ్యాంకు బోర్డులకు ఉందన్నది. చైర్మన్, బోర్డు సమావేశాలు, పలు కమిటీల ఏర్పాటు, వయసు, పదవీకాలం, డైరెక్టర్ల జీతాలు, డబ్ల్యూటీడీల నియామకాలకు సంబంధించి ఆర్బీఐ సూచనల్లో భాగంగానే పైవిధంగా నిర్ణయాలు వచ్చాయి.
కార్పొరేట్ పాలనపై..
త్వరలోనే బ్యాంకుల్లో కార్పొరేట్ పాలనపై మాస్టర్ డైరెక్షన్నూ రిజర్వ్ బ్యాంక్ చేస్తామన్నది. నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతోనే బ్యాంక్ ఆడిట్ కమిటీ బోర్డు ఏర్పాటవుతుందని స్పష్టం చేసింది.