చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
గర్శకుర్తిలో రాజ్యాంగ నిర్మాత విగ్రహం ఆవిష్కరణ
గంగాధర, ఏప్రిల్ 25: సమాజంలో ఉన్న అసమానతలను తొలగించి, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతిగా అంబేద్కర్ నిలిచారని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండలంలోని గర్శకుర్తిలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆదివారం ఆయన ఆవిష్కరించారు. పూలమాల వేసి నివాళులర్పించారు. రాజ్యాంగం ద్వారా అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు కల్పించిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. దళిత, వెనుకబడిన తరగతుల ప్రజల సంక్షేమానికి తెలంగాణ సర్కారు కృషి చేస్తున్నదని, దళితుల ఆర్థికాభివృద్ధి కోసం బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నదని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ రాజ్యాంగానికి తూట్లు పొడిచేలా పరిపాలన సాగిస్తున్నదని విమర్శించారు. కార్యక్రమంలో సర్పంచ్ అలువాల నాగలక్ష్మి, ఎంపీటీసీ తడిగొప్పుల రజిత, విగ్రహదాత కల్వకోట సవితాదేవి-శ్రీనివాస్, అంబేద్కర్ సంఘం మండలాధ్యక్షుడు కొలిపాక స్వామి, నాయకులు అలువాల తిరుపతి, తడిగొప్పుల రమేశ్, కల్వకోట శ్రీనివాస్రావు, అంబేద్కర్ సంఘం నాయకులు పాల్గొన్నారు.