హైదరాబాద్: నగరానికి చెందిన వ్యాక్సిన్, ఫార్మాసూటికల్ కంపెనీ బయోలాజికల్ ఇ లిమిటెడ్ (బీఈ) కరోనా వ్యాక్సిన్ మూడో దశ ప్రయోగాలకు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీవో) సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొదటి, రెండో దశ క్లినికల్ ప్రయోగాలాను తాము విజయవంతంగా పూర్తి చేసినట్లు సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది. గతేడాది నవంబర్లో బీఈ తన వ్యాక్సిన్ మొదటి, రెండో దశ క్లినికల్ ప్రయోగాలను ప్రారంభించింది.
బీఈ వ్యాక్సిన్ పూర్తి సురక్షితమని, రోగనిరోధక శక్తిని భారీగా పెంచుతోందని రెండు దశల ప్రయోగాల్లో నిరూపితమైనట్లు సంస్థ తెలిపింది. ప్రయోగాల్లో భాగంగా రెండు డోసుల వ్యాక్సిన్ను 28 రోజుల వ్యవధిలో ఇచ్చినట్లు చెప్పింది. ఈ ఫలితాలు తమకు చాలా ఆనందం కలిగించినట్లు బీఈ ఎండీ మహిమా దాట్లా చెప్పారు. కొవిడ్పై పోరులో తమది కూడా మరో సమర్థవంతమైన వ్యాక్సిన్ అవుతుందన్న ఆశాభావం ఆమె వ్యక్తం చేశారు.
మూడో దశ క్లినికల్ ట్రయల్స్ను ఇండియాలోని 15 ప్రదేశాల్లో నిర్వహించనున్నట్లు బీఈ ఆ ప్రకనటలో తెలిపింది. ఇందులో భాగంగా 18 నుంచి 80 ఏళ్ల మధ్య వయసున్న 1268 మందిపై ప్రయోగాలు నిర్వహించనున్నారు.