తలకొండపల్లి, ఏప్రిల్ 23 : మండలంలోని రాంపూర్, జంగారెడ్డిపల్లి, చౌదర్పల్లి తదితర గ్రామాల్లో గురువారం కురిసిన వడగండ్ల వానకు వరి, మామిడి తోటలు దెబ్బతిన్నాయి. శుక్రవారం రాంపూర్ గ్రామంలో దెబ్బతిన్న వరి పంటను ఎమ్మెల్యే జైపాల్యాదవ్ పరిశీలించారు. మండల వ్యవసాయ అధికారి రాజు, ఏఈవోలు చంద్రధన గ్రామంలో మామిడి తోటలను పరిశీలించారు. మండలంలో సమారు 130 ఎకరాల్లో వరి దెబ్బతిన్నదని ఏవో పేర్కొన్నారు. ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకునేలా ప్రభుత్వం, అధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. అనంతరం మెదక్పల్లి నుంచి చౌదర్పల్లి వరకు ఉన్న 11కేవీ విద్యుత్ వైర్లను సరిచేయాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్యాంసుందర్రెడ్డి, టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు శ్రీశైలంయాదవ్, రైతులు పాల్గొన్నారు.
గడువులోగా సాగు జలాలు
రైతులకు ఇచ్చిన మాట ప్రకారం గడువులోగా నాగిళ్ల వరకు డీ-82 కాల్వ ద్వారా సాగు జలాలను అందించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ హామీనిచ్చారు. శుక్రవారం మండల కేంద్రంలోని మహిళా సమాఖ్య కార్యాలయం ఆవరణలో వివిధ గ్రామాలకు చెందిన 18 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను ఎంపీపీ పద్మతో కలిసి ఎమ్మెల్యే అందజేశారు. అనంతరం పంచాయతీ కార్యాలయం ఆవరణలో సర్పంచ్ జంగయ్య, ఎంపీపీ పద్మతో కలిసి డ్రైనేజీ నిర్మాణాల పనులకు శంకుస్థాపన చేశారు. అసిరెడ్డిపల్లికి చెందిన లబ్ధిదారుడికి సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ కృష్ణ, ఎంపీడీవో ఫారుక్హుస్సేన్, రైతుబంధు సమితి జిల్లా డైరెక్టర్ కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు లాలయ్య పాల్గొన్నారు.