హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): కరోనా మహమ్మారి తీవ్రరూపం దాలుస్తున్న నేపథ్యంలో తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ, వారంతపు లాక్డౌన్పై 48 గంటల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని, లేనిపక్షంలో తగిన ఆదేశాలు జారీచేస్తామని హైకోర్టు స్పష్టంచేసింది. సోమవారం కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. జీహెచ్ఎంసీ పరిధిలో నమోదైన కేసులు వార్డులవారీగా కోర్టుకు సమర్పించాలని, దవాఖానల్లో సలహాలు ఇవ్వడానికి నోడల్ అధికారిని ఎవరినైనా నియమించారా? అని ధర్మాసనం ప్రశ్నించింది. వెబ్సైట్లో కొవిడ్ కేసుల వివరాలు నమోదు చేయాలని తెలిపింది. వివాహాలు, శుభకార్యాల్లో, పబ్లిక్ స్థలాల్లో ప్రజల హాజరు, సంచారంపై ఆంక్షలు విధించాలని సూచించింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై మరోసారి ప్రభుత్వం తీసుకున్న చర్యలపై పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది.
మున్సిపోల్స్ రద్దుపై లంచ్ మోషన్ పిటిషన్
రాష్ట్రంలో త్వరలో జరుగబోయే మున్సిపల్ ఎన్నికలను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ను కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ దాఖలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేయాలని కోరారు.