బడంగ్పేట, ఏప్రిల్19: జల్పల్లి మున్సిపాలిటీలో 28వ వార్డుకు జరిగే ఉపఎన్నికకు దూరంగా ఉండాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. దివంగత కౌన్సిలర్ నజియా కోడలు తసీమ్బేగంఏకగ్రీవ ఎన్నికకు మద్దతు ఇవ్వాలంటూ ఎంఐఎం విజ్ఞప్తి చేసింది. దీనికి సీఎం కేసీఆర్ సానుకూలంగా నిర్ణయం తీసుకున్నారని మం త్రి సబితాఇంద్రారెడ్డి వెల్లడించారు. యాకుత్పురా ఎమ్మెల్యే పాషాఖాద్రీ నేతృత్వంలో ఎంఐఎం బృందం ఆర్కేపురంలోని మంత్రి క్యాంపాఫీసులో కలిసి తసీమ్బేగంకు మద్దతివ్వాలని కోరారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్టు మంత్రి వివరించారు. ఎంఐఎం ప్రతిపాదనకు వారు సానుకూలంగా స్పందించి పోటీకి దూరంగా ఉండాలని ఆదేశించినట్టు తెలిపారు. మానవతా దక్పథంతోనే పోటీ చేయకూడదని నిర్ణయించారని పేర్కొన్నారు. తమ విజ్ఞప్తిని మన్నించడంపై ఎమ్మెల్యే పాషాఖాద్రీ, జల్పల్లి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్లాబిన్ అహ్మద్ హర్షం వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, సబితకు కృతజ్ఞతలు తెలిపారు.