రామగిరి, ఏప్రిల్ 18 : ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఓపెన్ స్కూల్లో ఈ సంవత్సరం అడ్మిషన్లు భారీగా పెరిగాయి. కరోనా నేపథ్యంలో మార్చి 30వరకు ప్రత్యేక అడ్మిషన్లు కొనసాగిస్తూ విద్యాశాఖ అనుమతి ఇవ్వడం, విద్యాశాఖ ఓపెన్ స్కూల్ సొసైటీపై అవగాహన పెంచడంతో అడ్మిషన్లు పెరిగాయని అధికారులు భావిస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 100 అధ్యయన కేంద్రాల్లో 8,204మంది అడ్మిషన్లు తీసుకున్నారు. వారిలో పదో తరగతిలో 4,575, ఇంటర్మీడియట్లో 3,629 మంది ఉన్నారు. వారి కోసం పాఠ్య పుస్తకాలు 70శాతం వరకు ఆయా అధ్యయన కేంద్రాలకు అందించారు. మరోవైపు మార్చి 21 నుంచి వాట్సాప్, ఆన్లైన్ విధానంలో తరగతుల నిర్వహణ సాగుతున్నది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 100 స్టడీ సెంటర్లలో 60పదో తరగతి కోసం, 40 కేంద్రాలు ఇంటర్మీడియట్ కోసం పని చేస్తున్నాయి.
జిల్లాకు చేరిన పాఠ్యప్తుసకాలు
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆన్లైన్లో అడ్మిషన్లు తీసుకున్న అభ్యర్థులందరికీ అవసరమైన పాఠ్యపుస్తకాలు జిల్లాకు చేరాయి. వీటిని నల్లగొండలోని గాంధీపార్కు ప్రభుత్వ పాఠశాలలో భద్రపర్చారు. అక్కడి నుంచి ఇప్పటికే 70శాతం వరకు చేరవేసినట్లు విద్యాశాఖాధికారులు తెలిపారు. మిగిలిన పాఠ్యపుస్తకాలు జిల్లాకు చేరగానే పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
ఆన్లైన్లో తరగతులు..
ఓపెన్ స్కూల్లో చేరిన వారికి ఆన్లైన్, వాట్సాప్ ద్వారా మార్చి 21 నుంచి జూన్ 6వరకు పాఠ్యాంశాలను బోధిస్తున్నారు. అదేవిధంగా జిల్లా విద్యాశాఖ రూపొందించిన యూట్యూబ్ చానల్లోని అంశాలు సైతం విద్యార్థులకు ఉపయోగపడుతున్నాయి. దీనికితోడు హైదరాబాద్ నుంచి రాష్ట్ర విద్యాశాఖ ప్రసారం చేసే వీడియోలు కూడా ఆయా గ్రూప్లో ఉంచి అవగాహన కల్పిస్తున్నారు.
నేటినుంచి పరీక్ష ఫీజు చెల్లింపు..
2021-22 విద్యా సంవత్సరం ఓపెన్ స్కూల్లో అడ్మిషన్లు తీసుకున్న అభ్యర్థులు ఆన్లైన్లో పదో తరగతి, ఇంటర్మీడియట్కు జూలై -2021లో నిర్వహించే పబ్లిక్ పరీక్షల కోసం ఫీజులను చెల్లించే అవకాశం కల్పించింది. ఈనెల 19నుంచి మే 10వరకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా వీటిని అన్ని మీసేవా కేంద్రాల్లో చెల్లించాల్సి ఉంటుంది. పదో తరగతి విద్యార్థి ప్రతి సబ్జెక్టుకు రూ.100, ఇంటర్మీడియట్ వారు థియరీ పరీక్షలు ప్రతి సబ్జెక్టు రూ.150, ప్రాక్టికల్స్కు ప్రతి సబ్జెక్టుకు రూ.100 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.