న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: దేశంలో కరోనా దావానలంలా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఆక్సిజన్ కొరత రాకుండా చూడాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధికారులను ఆదేశించారు. ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచాలని కోరారు. దేశంలో ఆక్సిజన్ డిమాండ్, సరఫరాపై శుక్రవారం ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. కరోనా తీవ్రత అధికంగా ఉన్న 12 రాష్ర్టాల్లో (మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ఛత్తీస్గఢ్, గుజరాత్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పంజాబ్, హర్యానా, రాజస్థాన్) ప్రస్తుతం ఆక్సిజన్ సరఫరా, రాబోయే 15 రోజుల్లో ఏ మేరకు అవసరమవుతుందో అధికారులను అడిగి తెలుసుకున్నారు. దేశంలోని ప్రతి ప్లాంట్లోనూ ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యం పెంచాలని సూచించారు. దేశవ్యాప్తంగా ఆక్సిజన్ ట్యాంకర్ల రవాణాకు ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలన్నారు. వివిధ మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం అత్యంత ముఖ్యమని చెప్పారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఆక్సిజన్ సిలిండర్ల ఫిల్లింగ్ ప్లాంట్లు 24 గంటలూ పనిచేసేలా అనుమతులు ఇచ్చినట్టు వెల్లడించింది. అలాగే ఇండస్ట్రియల్ ఆక్సిజన్ను మెడికల్ ఆక్సిజన్గా వినియోగించుకునేందుకు అనుమతినిచ్చినట్టు తెలిపింది. మెడికల్ ఆక్సిజన్ను దిగుమతి చేసుకునేందుకు చర్యలు చేపడుతున్నట్టు అధికారులు ప్రధానికి తెలిపారు. మరోవైపు, దేశవ్యాప్తంగా మెడికల్ ఆక్సిజన్ వాహనాల రాకపోకలకు ఎలాంటి ఆటంకాలు కల్పించొద్దని అన్ని రాష్ర్టాలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. అలాగే ప్రజారోగ్యానికి అత్యవసరమైన వైద్య సామగ్రి ఉత్పత్తి, సరఫరాపై ఎలాంటి ఆంక్షలు విధించొద్దని స్పష్టంచేసింది.