వాషింగ్టన్ : ఆఫ్ఘనిస్తాన్లో జరుగుతున్న యుద్ధానికి అమెరికా ఫుల్స్టాప్ పెట్టనున్నది. ఆ దేశంలో ఉన్న తమ సైనిక బలగాలను సెప్టెంబర్లోగా ఉపసంహరించనున్నట్లు అమెరికా చెప్పింది. అమెరికాపై ఉగ్రదాడి జరిగి 20 ఏళ్లు కావస్తున్న తరుణంలో.. ఆఫ్ఘన్ నుంచి తమ దళాలను వెనక్కి రప్పించనున్నట్లు బైడెన్ ప్రభుత్వాధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆప్ఘనిస్తాన్లో ఉన్న సుమారు 3500 మంది సైనికులను మే ఒకటో తేదీ నుంచి ఉపసంహరించాలని బైడెన్ సర్కార్ తన ఆదేశాల్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ నాటికి ఆ ప్రక్రియ పూర్తి కానున్నది. 2001లో విధించిన లక్ష్యాలను అమెరికా చేరుకున్నట్లు బైడెన్ ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. దళాల ఉపసంహరణపై బైడెన్ త్వరలో అధికారిక ప్రకటన చేయనున్నారు. ఆప్ఘనిస్తాన్లో తమ సైనికులను దింపిన అమెరికా.. గత 20 ఏళ్ల నుంచి ఉగ్రవాదులతో పోరాడుతూనే ఉన్నది. ఆఫ్ఘన్ యుద్ధాన్ని పర్యవేక్షిస్తున్న నాలుగవ అధ్యక్షుడుగా బైడెన్ నిలుస్తారు. ఈ యుద్ధం కోసం ఆ దేశం ట్రిలియన్ల డాలర్లు ఖర్చు చేసింది. వేలాది మంది సైనికుల్ని కోల్పోయింది.