రాశిఫలాలు వివరించిన బుట్టే వీరభద్ర స్వామి
పరోక్ష సేవలకు సంవత్సరోత్సవం
అర్చక పండితులకు ఉగాది పురస్కారాలు
శ్రీశైలం, ఏప్రిల్ 13: ప్రపంచ శాంతిని కోరుతూ ప్లవనామ సంవత్సరం అందరిలోనూ సుఖసంతోషాలను ఆయురారోగ్యాలను నింపాలని ఈవో కేఎస్ రామారావు కోరుతూ ఉగాది పర్వదినాన శ్రీశైల దేవస్థాన పంచాగాన్ని ఆవిష్కరించారు. మంగళవారం ఉదయం అలంకారమండపంలో పంచాంగానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం దేవస్థాన ఆస్థాన సిద్ధ్దాంతి శ్రీ పండిత బుట్టే వీరభద్రదైవజ్ఞతో పంచాంగ శ్రవణం నిర్వహించారు. అనంతరం ఆస్థాన సిద్దాంతి బుటేవారితోపాటు ఉభయ ఆలయాల ప్రధాన అర్చకులు, స్థానాచార్యులు, ఉప ప్రధాన అర్చకులు, వేదపండితులకు వేదాశీర్వచనాలు చేసి శేషవస్ర్తాలు, ప్లవనామ పంచాంగం, తీర్థప్రసాదాలు ఇచ్చి ఉగాది పురస్కారాలు అందజేశారు.
పరోక్ష సేవలకు సంవత్సరోత్సవం
సంవత్సరం క్రితం కొవిడ్ నిబంధనలలో భాగంగా లాక్డౌన్ అమలు చేసినప్పటి నుంచి భక్తుల కోరిక మేరకు దేవస్థానం పరోక్ష సేవలను ప్రారంభించి నేటితో సంవత్సర కాలం ముగిసిందని ఈవో కేఎస్ రామారావు అన్నారు. ఈ సేవలలో భక్తులు క్షేత్రానికి చేరుకోలేనప్పటికీ స్వామి, అమ్మవార్లకు నిత్యం నిర్వహించే 10 విధాలైన సేవలలో తమ గోత్రనామాలతో అర్చనలు, హోమాలు చేసుకునే వెసులుబాటును కల్పించింది. ఈ సంవత్సర కాలంలో 19,362 మంది భక్తులు పాల్గొనగా రూ.2,23,29,059 దేవస్థానానికి ఆదాయ విరాళంగా వచ్చిందని తెలిపారు. ఇందుకు సహకరించిన అర్చక వేదపండితులు, ఆలయ సిబ్బంది అధికారులతోపాటు శ్రీశైలటీవీ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారాలను దేశవిదేశాల్లోని సేవాకర్తలకు అందించినందుకు అభినందించారు.