సిద్దిపేట అర్బన్, ఏప్రిల్ 13 : చెమట చుక్క పడకుండా.. నయా పైసా ఖర్చు లేకుండా గూడు లేని నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. సొంత ఆడబిడ్డలకు, కుటుంబ సభ్యుడిగా లబ్ధిదారులకు పట్టు వస్ర్తాలను మంత్రి హరీశ్రావు అందజేశారు. సిద్దిపేట విపంచి ఆడిటోరియంలో 232 మంది లబ్ధిదారులకు, ఇందులో లింగారెడ్డిపల్లికి చెందిన 15 దివ్యాంగులకు మంత్రి చేతుల మీదుగా పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. పారదర్శకంగా ఇండ్ల కేటాయింపు జరిపామని, ప్రతి వార్డులో గోడలపై అతికించినట్లు, లంచం, పైరవీ లేకుండా అర్హులని తేలిన వారికి డబుల్బెడ్రూం ఇస్తున్నట్లు తెలిపారు. కట్టిన ఇల్లు, పెట్టిన పొయ్యి.. కొత్త సంవత్సరంలో పట్టు వస్ర్తాలతో గృహప్రవేశాలు చేపిస్తున్నామన్నారు. ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ మాట్లాడారు. సిద్దిపేట అభివృద్ధికి మంత్రి హరీశ్రావు చేస్తున్న సేవలను కొనియాడారు. పనిచేసే ప్రభుత్వానికి అండగా నిలువాలని ప్రజలను కోరారు. అంతకు ముందు మున్సిపల్ చైర్మన్ రాజనర్సు మాట్లాడుతూ గూడు లేని నిరుపేదలు ఆత్మగౌరవంతో జీవించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లను అందిస్తుందన్నారు. మంత్రి వెంట సుడా చైర్మన్ రవీందర్రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అక్తర్పటేల్, కౌన్సిలర్లు ఉన్నారు.
కోమటి చెరువు నెక్లెస్రోడ్డుపై పంచాంగ శ్రవణం ..
ప్రశాంత్నగర్, ఏప్రిల్ 13 : సిద్దిపేట కోమటి చెరువు రోడ్డుపై ప్లవనామ సంవత్సర ఉగాది వేడుకలు పురస్కరించుకొని సోమవారం సాయంత్రం సిద్దిపేట బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు. కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు హాజరయ్యారు. ఈ మేరకు వేదపండితులు చెప్పెల హరినాథశర్మ నేతృత్వంలో పంచాంగ శ్రవణం చదివి వినిపించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ప్లవనామ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం బాగుంటుందన్నారు. రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు సాగుతుందని మంత్రి పేర్కొన్నారు. పాశ్చాత్య దోరణులకు మోడల్ అనుకున్న దేశాలన్నీ మన దేశ సాంప్రదాయాలకు, పద్ధతులకు విలువనిస్తున్నాయన్నారు. హిందూ ధర్మాన్ని పాటించి ధర్మాన్ని కాపాడుకునేలా దేవాలయాల పరిరక్షణకు పూనుకోవాలన్నారు. ప్లవనామ సంవత్సరంలో అందరికీ శుభాలు జరుగాలని కరోనా పీడ తొందరగా పోవాలని, అభివృద్ధి సాధించాలని మంత్రి ఆకాంక్షించారు.