కోల్కతా, ఏప్రిల్ 12: పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీపై ఎన్నికల కమిషన్ (ఈసీ) 24 గంటల ప్రచార నిషేధాన్ని విధించింది. సోమవారం ఉదయం 8 గంటల నుంచి ఈ నిషేధం అమలులోకి వచ్చింది. కేంద్ర బలగాలను ఘెరావ్ చేయాలని ఓటర్లను ప్రేరేపించినందుకు, మతం పేరుతో ఓట్లు అడిగినందుకు ఆమె 24 గంటల పాటు ప్రచారం నిర్వహించకుండా నిషేధం విధించినట్టు ఈసీ ప్రకటించింది. ఎన్నికల సంఘం నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం అని మమత అన్నారు. దీనిపై మంగళవారం కోల్కతాలో ధర్నా చేస్తానని ప్రకటించారు. మమతపై నిషేధాన్ని తృణమూల్ కాంగ్రెస్ ఖండించింది. ఇది ప్రజాస్వామ్యానికి దుర్దినం అని అభివర్ణించింది.
ప్రచారం నిర్వహించకుండా తనపై నిషేధం విధించడంపై మమత మండిపడ్డారు. కూచ్బిహార్ లాంటి ఘటనలు మరిన్ని జరుగుతాయని ప్రజలను హెచ్చరించిన నేతలను రాజకీయాల నుంచి నిషేధించాలని మమతాబెనర్జీ డిమాండ్ చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలని చూస్తే ఇలాంటి కాల్పులు రాష్ట్రంలో మరిన్ని జరుగుతాయని, సితల్కుచిలో మరింత మంది మరణించాల్సి ఉండేదని రాష్ట్ర బీజేపీ నేతలు వ్యాఖ్యానించారు. బీజేపీ నేతల వ్యాఖ్యలతో తాను షాక్కు గురయ్యానని, వాళ్లు అసలు ప్రజా రాజకీయాల్లో ఉన్న నాయకులేనా? అని నడియా జిల్లాలో సోమవారం ఎన్నికల ప్రచారంలో ఆమె అన్నారు. ఆ నేతలను రాజకీయాల నుంచి నిషేధించాలని డిమాండ్ చేశారు. బీజేపీ అనేది హత్యల పార్టీ అని మండిపడ్డారు. ‘బీజేపీ నేతలు వాళ్ల వాహనాలను వాళ్లే తగులబెట్టుకొంటున్నారు. వాళ్ల కార్యకర్తలను వాళ్లే చంపుకొని మా పార్టీ తృణమూల్పై ఆరోపణలు చేస్తున్నారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్రప్రభుత్వం రూపొందించిన జాతీయ పౌర పట్టిక (ఎన్నార్సీ) ప్రభావం గూర్ఖాలపై ఏమాత్రం ఉండదని కేంద్ర హోంమంత్రి అమిత్షా అన్నారు. నరేంద్రమోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నంతవరకు ఒక్క గూర్ఖాకు కూడా హాని జరుగదన్నారు. పశ్చిమబెంగాల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆయన కలిమ్పోంగ్లో ఎన్నికల ర్యాలీలో మాట్లాడారు. గూర్ఖాలను భయపెట్టేందుకే ఎన్నార్సీపై తృణమూల్ కాంగ్రెస్ అసత్య ప్రచారం చేస్తున్నదని ఆరోపించారు. ఇటీవల జరిగిన అనేక మంది గూర్ఖాల మరణానికి మమతాబెనర్జీ ప్రభుత్వమే కారణమన్నారు.
బర్ధమన్/కల్యాణి, ఏప్రిల్ 12: పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో మమతాబెనర్జీ క్లీన్బౌల్డ్ అయ్యారని ప్రధాని మోదీ అన్నారు. నాలుగు దశల పోలింగ్ ముగిసేనాటికే బీజేపీ సెంచరీ కొట్టేసిందని వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేసి పలు చోట్ల ఎన్నికల సభల్లో క్రికెట్ పరిభాషలో ప్రసంగించారు. నాలుగదశల పోలింగ్లో బెంగాల్ ప్రజలు ఎన్నో ఫోర్లు, సిక్స్లు కొట్టారని, తృణమూల్ కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయిందని అన్నారు. కేంద్రబలగాలపైకి ప్రజలను మమత రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ఎస్సీలు బిచ్చగాళ్లంటూ మమతకు అత్యంత సన్నిహిత నేత ఒకరు తీవ్ర వ్యాఖ్యలు చేసినా ఆమె ఖండించలేదని మండిపడ్డారు. నందిగ్రామ్లో మమతను ప్రజలు క్లీన్బౌల్డ్ చేసి ఫీల్డ్ (ఎన్నికల బరి) నుంచి తప్పకోవాలని ఆమెకు స్పష్టంచేశారన్నారు.