నేడు ప్లవనామ సంవత్సరానికి స్వాగతం
వేడుకలకు సిద్ధమైన ప్రజలు
నిబంధనలు పాటించాలి : అధికారులు
మంచిర్యాల, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ) /హాజీపూర్ : కాల గమనంలో మరో తెలుగు వత్స రం గడిచిపోయింది. ఎన్నెన్నో ఆనందాలు, ఆటుపోట్లను చవిచూపిన శార్వరి సంవత్సరం. ప్లవనామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ వెళ్లిపోయింది. ఈ పర్వదినం తమ జీవితాల్లో కోటి కాంతులను నింపాలని కోరుకుంటూ ‘ఉగాది’ని నేడు ఘనంగా జరుపుకునేందుకు జిల్లా ప్రజానీకం సిద్ధమైంది. ఈ సందర్భంగా పంచాంగ పఠనాలు, పచ్చళ్ల పంపిణీ మధ్య ధార్మి క, పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
తెలుగునాట కాల గమనం..
వసంతగమన శుభవేళ, పచ్చదనం సింగారించుకొని కళకళలాడే ప్రకృతి సాక్షిగా, ‘చిత్త’ నక్షత్ర ప్రవేశంతో చైత్రశుద్ధ పాఢ్యమి రోజున వచ్చే పం డుగ ఇది. ఇక ప్లవ నామ సంవత్సరం ప్రారంభంకానున్నది. ప్రమోదాల కలబోతగా గడచిన ఏడాదికి వీడ్కోలు పలుకుతూ, రాబోయే సంవత్సరమైనా తమ జీవితాల్లో నవ్యకాంతుల్ని నింపుతుందనే ఆశతో మరో వసంతాన్ని స్వాగతించడమే ఉగాది పరమార్థం. తెలుగునాట కాలగమనం ప్రారంభమైంది ఈ రోజునే కావడం విశేషం. సక ల చరాచర సృష్టికి బ్రహ్మదేవుడు బీజం వేసింది ఈ రోజే అంటారు. నిజానికి ఈ ‘యుగాది’ కాల ప్రవాహంలో ‘ఉగాది’గా పరిణమించిందని చెబుతారు. సంప్రదాయ వాదుల మధ్య సౌహార్ధ్రతను, సన్నిహితులు, శ్రేయాభిలాశులకు మధ్య ఉల్లాసాన్ని ద్విగుణీకృతం చేసే ఈ అపురూప వేడుకను మంగళవారం ఘనంగా జరుపుకునేందుకు జిల్లావాసులు సిద్ధమయ్యారు. షడ్రుచుల సమ్మేళన ఉగాది పచ్చడిని స్వీకరించి, బూరెలు లాగించి కబుర్లలో మునిగి తేలనున్నారు.
అన్నింటా తొలిపండుగే..
తెలుగువారి పండుగల్లో ఉగాది తొలి పండు గ. ఈ పండుగ పుట్టుకకు సంబంధించి అనేక పురాణ గాథలున్నాయి. వేదాలను తస్కరించిన సోమకాసురుడి బారి నుంచి వాటిని కాపాడి, బ్రహ్మదేవుడికి అప్పగించేందుకు శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం దాల్చాడని పౌరాణికగాథ, శ్రీ మహావావిష్ణవు చైత్రశుద్ధ పాఢ్యమి నాడే మత్స్యావతారం ఎత్తాడని చెబుతారు. కనుకనే శ్రీమహా విష్ణువు అవతార గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటారని పురాణాలు ప్రవచిస్తున్నాయి. ఈ రోజు బ్రహ్మ సృష్టికి శ్రీకారం చుట్టాడంటారు. చైత్రశుద్ధ పాఢ్యమి నాటికి ద్వాపర యుగం పూర్తయి.. కలియుగం ప్రారంభమైందని, కృష్ణావతారం ముగిసిన ఆ రోజే భువిలో కలి ప్రవేశించిందని, అందువల్ల ఉగాదిని ఆ రోజు జరుపుకోవడం ఆచారంగా వస్తుందని పలువురు చెపుతారు. ఈ రోజు ఉదయమే స్నానం చేసి, ఉగాది పచ్చడి తయారు చేసి, దైవానికి నైవేద్యంగా సమర్పించాకే స్వీకరించాలి. పచ్చడిలో పులుపు, తీపి, చేదులను జీవితంలోని సుఖదుఃఖాలకు అన్వయిస్తారు. జీవితం అం టే అన్ని రుచుల సమ్మేళనం లాంటిదన్న వేదాంత సారాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది.
యుగాలకు ఆది..
హైందవ పురాణాల ప్రకారం సృష్టికర్త బ్రహ్మదేవుడు చైత్రశుక్ల పౌఢ్యమి రోజున జగతిని సృష్టించాడు. జగతి సృష్టితోనే యుగాలు మెదలయ్యాయి. యుగాల ప్రారంభానికి ఆదిగా నిలిచే వేడుక అయినందునే ‘ఉగాది’గా అత్యంత ప్రాశస్తం పొందినది. కాలగమనంలో యుగాదే ‘ఉగాది’గా పరిమాణం చెందిందని పండితులు పేర్కొంటున్నారు. ఉగాదిన శ్రీరామచంద్రుడు రావణుడిపై విజయం సాధించినందునే శ్రీరామ కల్యాణ వేడుకలకు ముందుగా జరిగే నవరాత్రి ఉత్సవాలు కూడా ఉగాది నుంచి ప్రారంభించడం ఆనవాయితీగా వస్తుంది.
షడ్రుచుల సమ్మేళనం…
ఉగాది వేడుకల్లో ఆధ్యాత్మికత, ధార్మిక చింతన భావాలతో పాటు ఆరోగ్య సూత్రాలు మిళితమై ఉన్నాయి. ఆరు రుతువుల్లో సహజంగా పిత్త, వాత, కఫ దోషాలు, చక ప్రోప ప్రశమశాత కలుగుతాయి. వీటిని ఆయుర్వేద నిపుణులు త్రిదోషాలుగా పేర్కొంటారు. వసంత రుతువులో కఫం ప్రకోపిస్తుంది. దాన్ని నివారించేందుకు కటు, తిక్త, కషాయ రసాలు ఉపకరిస్తాయి. అందుకే ఉగాదిన సంపూర్ణ ఆరోగ్యానికి షడ్రుచులను ఉగాది పచ్చడి రూపంలో స్వీకరిస్తారు. ఉగాది వినియోగించే వస్తువుల్లో కొత్తబెల్లం, కొత్త చింత పండు, ఉప్పు, మామిడి కాయలు, పచ్చిమిర్చి, వేప పూవు, ప్రాశస్త్యం పొందాయి. వీటినే ఆమ్లం (పులుపు), లవణం (ఉప్పు), కటువు (కారం), తిక్తం (చేదు), కషాయం (వగరు) అనే షడ్రుచు ల సమ్మేళనంగా పేర్కొంటారు. ఈ ఉగాదికి తయారు చేసే పచ్చడి ఆరోగ్యానికి సంజీవనిలా పని చేస్తుంది. బెల్లం రక్తంలోని హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. ఈ పండుగ వచ్చేసరికి రుతువుల్లోని తేడాలవల్ల కొంత అనారోగ్యం కలుగుతుంది. ఆ అనారోగ్యాన్ని తొలగించేదే ఈ ఉగాది పచ్చడి.
పంచాంగ శ్రవణం…
ఈ రోజు ముఖ్యమైన ఆచారం పంచాంగం శ్రవణం. పంచాంగం అంటే తిథి, వార, నక్షత్ర, యోగ, కరణం, అనే ఐదు అంశాలుగల శాస్త్రం. పంచాంగ శ్రవణం ద్వారా తిథివార యోగ కరణముల ఫలితాలను తెలుసుకుంటే, గంగాస్నాన ఫలం కలుగుతుంది. అంతేగాక భూమిని, బంగారాన్ని, గోవులను, ఏనుగుల్ని మొదలైన వాటిని దానమిస్తే కలిగే ఫలం పంచాంగ శ్రవణం వల్ల కలుగుతుంది.
సామాజిక వ్యాప్తి వద్దు..
కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో రం జాన్, ఉగాది, శ్రీరామ నవమివంటి పండుగలు జాగ్రత్తగా జరుపుకోవాలని, ఇంటి వద్ద నిర్వహిం చుకోవడమే మేలని ప్రభుత్వం చెబుతున్నది. ఇక ఉగాది పంచాంగ శ్రవణంతో గుంపులుగుంపులుగా ఉండే అవకాశం ఉందని, దేవాలయాల్లో నిర్వహించవద్దని సూచిస్తున్నది.
ఇవి కూడా చదవండి
మంత్రి ఎర్రబెల్లి ఉగాది శుభాకాంక్షలు