పరిగి, ఏప్రిల్ 11 : వచ్చే విద్యా సంవత్సరానికి విద్యార్థులకు ఉచితంగా అందజేసేందుకు అవసరమైన పాఠ్య పుస్తకాల పంపిణీ త్వరగా చేపట్టడానికి సర్కారు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ముద్రణాలయం నుంచి నేరుగా జిల్లా కేంద్రమైన వికారాబాద్లోని బుక్డిపోకు పాఠ్య పుస్తకాలు చేరవేతకు సర్కారు చర్యలు చేపట్టింది. తద్వారా పాఠశాలలు పునః ప్రారంభమైన వెంటనే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందుబాటులో ఉంచాలనేది సర్కారు ఆలోచన. వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, గురుకులాలకు సుమారు 6లక్షలు పాఠ్య పుస్తకాలు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. యూడైస్ ఆధారంగా ఎన్ని పుస్తకాలు అవసరమేనేది ఆయా పాఠశాలల వారీగా లెక్కలు తేల్చి వాటిని పంపిణీ చేస్తారు. పాఠశాలలకు చేరవేయడానికి పాఠ్య పుస్తకాలు వికారాబాద్ బుక్ డిపోకు శనివారం నుంచి చేరవేత ప్రారంభమైంది. మొదటిరోజు 15వేల పాఠ్య పుస్తకాలు బుక్డిపోకు చేరవేశారు. మిగతావి ముద్రణాలయంలో ముద్రించిన మేరకు విడుతల వారీగా చేరవేస్తారు.
సరిపడా పుస్తకాలు…
వికారాబాద్ జిల్లా పరిధిలో 1003 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. 9 మోడల్ స్కూళ్లు, 18 కస్తూర్బాగాంధీ విద్యాలయాలు, 6 ఆశ్రమ పాఠశాలలు, రెండు సంగెం లక్ష్మీబాయి గురుకులాలు, 8 సాంఘిక సంక్షేమ గురుకులాలు, 7 బీసీ గురుకులాలు, 6 మైనార్టీ గురుకులాలు, 2 టీఆర్ఐఈఎస్లు ఉన్నాయి. విద్యార్థులకు 2021-22 విద్యా సంవత్సరానికి సుమారు 6లక్షలు పాఠ్య పుస్తకాలు అవసరమని విద్యా శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. సుమారు 30వేల పాఠ్య పుస్తకాలు జిల్లా కేంద్రంలోని బుక్డిపోలో గత సంవత్సరం పంపిణీ చేయగా మిగిలి ఉన్నాయి. మిగతా 5.70 లక్షల పాఠ్య పుస్తకాలు బుక్డిపోకు చేరవేయాల్సి ఉన్నది. ప్రతి పాఠ్య పుస్తకంపై బార్కోడ్ ముద్రించింది. తద్వారా ప్రభుత్వం పేద విద్యార్థులకు ఉచితంగా అందజేసే పాఠ్య పుస్తకాలు పక్కదారి పట్టకుండా నిర్దేశించిన వారికే అందజేసేందుకు ఈ చర్యలు చేపట్టింది.
కార్గోబస్సుల్లో పాఠ్య పుస్తకాలు తరలింపు
ఆర్టీసీకి ఆదాయం పెంపొందించడంలో భాగంగా ఏర్పాటుచేసిన కార్గో బస్సు సర్వీసులను పాఠ్య పుస్తకాలను తరలింపునకు వినియోగించనున్నారు. దీంతోపాటు అవసరమైతే జిల్లా కేంద్రంలోని బుక్ డిపో నుంచి ఆయా మండల కేంద్రాల్లోని మండల విద్యా వనరుల కేంద్రాలకు తరలించనున్నారు. తద్వారా రవాణా చార్జీలు చాలావరకు కలిసిరానున్నాయి. మరోవైపు ఆర్టీసీకి ఆదాయం చేకూరనున్నది. జిల్లాలోని పాఠశాలలకు పాఠ్య పుస్తకాల పంపిణీ కార్యక్రమం వచ్చే నెల ప్రారంభంలో చేపట్టనున్నారు. విద్యాసంవత్సరం ప్రారంభం కంటే ముందుగానే పాఠ్య పుస్తకాలను ఆయా పాఠశాలలకు చేరవేయనున్నారు.
ఇవీ కూడా చదవండి…