‘నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యడమంటే కరువును ఆహ్వానించడమే. ఆ పార్టీకి అధికారమిచ్చిన పాపానికి తెలంగాణలో ఏర్పడిందంతా క్షామమే కదా! ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టిన ఫ్లోరోసిస్ కాంగ్రెస్ నేతలతోపాటే పెరిగి నల్లగొండ జిల్లాను కుంగదీసింది నిజం కాదా?’ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ప్రశ్నించారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్, ఎంపీ బడుగుల, ఎమ్మెల్సీ చిన్నపరెడ్డి, ఎమ్మెల్యే శానంపూడి, సీనియర్ నాయకుడు ఎంసీ కోటిరెడ్డితో కలిసి శనివారం తిరుమలగిరి (సాగర్) మండలంలో మంత్రి విస్తృతంగా పర్యటించారు. ఏడు సార్లు ఎమ్యెల్యేగా గెలుపొంది మంత్రి పదవులు అనుభవించిన పెద్దమనిషి జానారెడ్డి ఈ ప్రాంతానికి ఏమీ చెయ్యలేదని, ఇప్పుడు ఓట్ల కోసం మళ్లీ వస్తున్నారని విమర్శించారు.
ఆయన హయాంలో పొలాలెందుకు బీళ్లుగా ఉన్నాయో ప్రజలు ప్రశ్నించాలన్నారు. శాసనసభలో మీ గురించి ఎందుకు ప్రస్తావించలేదని నిలదీయాలన్నారు. మోదీని నమ్మి బీజేపీకి ఓటేస్తే మన జేబుకు చిల్లు పెట్టాడని, ఈ ఉప ఎన్నికల్లో ఆ పార్టీకి డిపాజిట్ కూడా దక్కదని మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తేనే జనం జీవితాల్లో వెలుగులు నిండుతాయని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో రైతులు తల్లిదండ్రులకు కూడా బువ్వ పెట్టలేని పరిస్థితిలో కొట్టుమిట్టాడారని, నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు దగ్గర్లోనే ఉన్నా సాగునీరందక కరువుతో అల్లాడిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ రాకతో వారి బతుకులు మారిపోయాయని, చివరి ఎకరాకు సైతం రెండు కార్లు నీరందించి భరోసా కల్పించారని పేర్కొన్నారు. రూ.74కోట్ల వ్యయంతో చేపట్టిన నెల్లికల్, కుంకుడు చెట్టు తండాల ఎత్తిపోతలతో 30వేల ఎకరాలకు నీరందించనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్కు ఓటు వేస్తే కరువు వచ్చిందని, బీజేపీకి ఓటు వేస్తే నిత్యావసరాల ధరలు పెంచి సామాన్యుడి నడ్డివిరిచిందని చెబుతూ కారు గుర్తుకు ఓటేస్తే సంక్షేమ పథకాలు వచ్చాయని తెలిపారు. నాగార్జున సాగర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం నోముల భగత్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా కొంపల్లి గ్రామాన్ని దత్తత తీసుకున్నట్లు ప్రకటించారు. ప్రచారంలో కడారి అంజయ్య యాదవ్, ఎంపీపీ భగవాన్నాయక్, జడ్పీటీసీ సూర్యబాషానాయక్, నాయకులు పిడిగం నాగయ్య, గుండెబోయిన లింగయ్య, బొల్లేపల్లి శ్రీనివాసరాజు, అల్లి పెద్దిరాజు, కొమరయ్య, పోట్యా, బాబూరావు, సైదిరెడ్డి, ఆంజనేయులు, శ్రీనివాస్రెడ్డి, రామయ్య, బిన్ని యాదవ్ పాల్గొన్నారు.
టీఆర్ఎస్తోనే అభివృద్ధి
నాగార్జునసాగర్ నియోజకవర్గాభివృద్ధి టీఆర్ఎస్ పార్టీతోనే ప్రారంభమైంది. నోముల భగత్ పరుగెత్తే గుర్రమైతే జానారెడ్డి పనైపోయిన గుర్రం.. నడవడం చేతగాక, మాట్లాడలేక ప్రచారం వద్దన్నాడు. 35ఏండ్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసినా ప్రజలకు చేసిన మంచి పనులేమీ లేవు. సంక్షేమ పథకాలతో లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నింపుతున్న టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి.
పాలనను చూసి ఓటెయ్యండి..
నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజలు 40ఏండ్లుగా కాంగ్రెస్ పాలనలో దగాపడ్డారు. కరెంట్ రాక, లిఫ్ట్లు లేక రాత్రంతా పొలాల కాడ రైతులు జాగారం చేసిన రోజులు ఇంకా గుర్తున్నాయి. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక తండాలు గ్రామ పంచాయతీలుగా మారి అభివృద్ధి జరిగింది. 24గంటల కరెంట్, రైతు బంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ వచ్చిందని, అభివృద్ధి, అందరి సంక్షేమం కోసం పాటుపడుతున్న టీఆర్ఎస్ సర్కారుకు మీరంతా అండగా ఉండాలి.
నాగార్జునసాగర్ను నంబర్ వన్ చేస్తా..
నేను తండ్రి చనిపోయిన బిడ్డను.. ఇక్కడున్న మహిళలంతా నన్ను మీ కొడుకుగా, మీ తోబుట్టువుగా భావించి ఆశీర్వదించండి. ఈ నెల 17న జరిగే ఎన్నికల్లో మీరంతా కారు గుర్తుపై ఓటేసి గెలిపించి శాసనసభకు పంపించండి. జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి సహకారం, ముఖ్యమంత్రి కేసీఆర్ అండదండలతో నాగార్జునసాగర్ నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి నంబర్ వన్గా నిలబెడతా. మీ అందరి ఆలోచనల మేరకు గ్రామాల్లో మిలిగిపోయిన అభివృద్ధి పనులన్నీ తొందరగా పూర్తి చేసేందుకు కృషి చేస్తా.
భగత్ నేటి ప్రచారం షెడ్యూల్
తిరుమలగిరి(సాగర్) మండలం : ఎర్రచెరువు, నెల్లికల్లు, జూలుతండా, పిల్లిగుండ్ల తండా, గోడుమడక, బట్టువెంకన్నబలి తండా, సపావట్ తండా, చింతలపాలెం, నాగార్జునపేట, తిమ్మాయిపాలెం, నాయకునితండా, తనికిమాతల, జువ్విచెట్టుతండా, గట్టుమీది తండా, మీగ్యాతండా, ధన్సింగ్ తండా,
శీతల తండా, నేతాపురం
కేసీఆర్ సారు పథకాలతో ఎంతో మేలు..
30ఏండ్లుగా జానారెడ్డిని గెలిపిస్తే ఒక్క పనీ చేయలేదు. కేసీఆర్ సారు ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఒక్కరికీ అందుతున్నయి. రైతుబంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్లు పేదోళ్లకు చాలా ఉపయోగపడుతున్నయి. చిన్న, చిన్న ఖర్చులకు మమ్మల్ని డబ్బులు అడిగే మా అమ్మ ఇప్పుడు మాపై ఆధారపడట్లేదు.
24గంటల కరెంట్ ఇచ్చి ఎంతో మేలు జేస్తుండ్రు…
టీడీపీ, కాంగ్రెసోళ్ల కాలంలో కరెంటు సక్కగ ఉండక రాత్రిళ్లు మోటర్ల కాడ పడిగాపుగాయాల్సి వచ్చేది. కేసీఆర్ సారు వచ్చినంక 24గంటల కరెంట్ ఇచ్చి ఎంతో మేలు జేస్తుండు. మాకు రెండున్నర ఎకరాల భూమి ఉంది. రెండు కార్లకు కలిపి ఏటా 25వేలు వస్తున్నయి. రైతులకు ఇన్ని సౌకర్యాలు కల్పిస్తున్న సారును మర్చిపోం.
కేసీఆర్ సారొచ్చి పేదోళ్లకు ధైర్యమిచ్చిండు..
కేసీఆర్ సారు దయతోనే బతుకుతున్నం. నాకు గొర్లు ఇచ్చిండు. రెండు వేలు పింఛన్ కూడ ఇస్తున్నడు. గొర్లు కాసుకుంట నాలుగు పైసలు సంపాదించుకుంటున్నం. సారు వచ్చినంకనే పేదోళ్లకు ధైర్యం వచ్చింది. ఇన్నేండ్లు మా బాగు ఎవ్వరు పట్టించుకోలే. మా లాంటి పేదోళ్లను ఆదుకుంటున్న టీఆర్ఎస్ పార్టీకే మేం ఓటు వేస్తాం.
టీఆర్ఎస్కు కాంట్రాక్టు అధ్యాపకుల మద్దతు
పెద్దవూర, ఏప్రిల్ 10 : కాంట్రాక్టు అధ్యాపకులు టీఆర్ఎస్కు మద్దతుగా ఉప ఎన్నికల్లో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. శనివారం పెద్దవూర, త్రిపురారం, నిడమనూరు, తిరుమలగిరి, గుర్రంపోడు మండలాల్లో పర్యటించి సీఎం కేసీఆర్ చేపట్టి పథకాలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎ.పరశురాములు, ప్రొఫెసర్ రమణా నాయక్, ప్రేమయ్య, బాలకోటి నాయక్, యశ్వంత్, భూమయ్య, శివారెడ్డి, తిరుపతి పాల్గొన్నారు.
నేడు, రేపు ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ
నల్లగొండ, ఏప్రిల్ 10 : ప్రిసైడింగ్ అధికారులకు ఆది, సోమవారాల్లో నిడమనూరు మండల కేంద్రంలోని బంకాపురం రోడ్డులో ఉన్న టీఎస్ మోడల్ స్కూల్లో రెండో విడుత శిక్షణ ఇవ్వనున్నట్లు కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణకు తప్పకుండా హాజరుకావాలని ఆదేశించారు.
ఫిర్యాదులుంటే డయల్ @ 8143113827
నాగార్జునసాగర్ ఉప ఎన్నికలకు సంబంధించి ఏవైనా అనుమానాలుంటే కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకుడు సునీల్ కుమార్కు ఫిర్యాదు చేయవచ్చని నల్లగొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 8143113827 సెల్ నంబర్లో సంప్రదించవ్చని పేర్కొన్నారు.
అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
బీసీల ఐక్యత, బలంపై నమ్మకంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక అవకాశం ఇచ్చారు.. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. సాగర్ ఉప ఎన్నికల్లో బీసీలతో పాటు వెనుకబడిన సామాజికవర్గాలకు చెందిన వారంతా ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. భగత్ గెలుపు రాజకీయాల్లో మార్పునకు సంకేతం.
భగత్ను గెలిపిస్తే బీసీల గొంతుక అయితడు భగత్ను గెలిపిస్తే శాసనసభలో బీసీల గొంతుకగా ఉంటాడు. ప్రజా పోరాటాల గొంతుక అయిన నోముల నర్సింహయ్య వారసుడిగా భగత్ గెలుపునకు అన్ని పార్టీల్లో ఉన్నటువంటి బీసీ నాయకులు సహకరించాలి. ఈ ఎన్నిక బీసీల ఆత్మగౌరవంతో ముడిపడి ఉంది.