రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ)/ రాంనగర్: సిరిసిల్ల మత్స్యశాఖలో అవినీతి చేపలు ఏసీబీ వలకు చిక్కాయి. ఏసీబీ అధికారుల వివరాల ప్రకారం.. చందుర్తి మండలానికి చెందిన పందిరి నర్స య్య, రుద్రంగి మండలానికి చెందిన గడ్డం జనార్దన్ మహిళా సొసైటీ ఏర్పాటు కోసం గత నెలలో దరఖాస్తు చేసుకున్నారు. అయితే కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు మత్స్యశాఖ డిప్యూటీ డెరెక్టర్గా ఉన్న ఖదీర్ అహ్మద్ సొసైటీ ఏర్పాటు కావాలంటే 50వేలు ఇవ్వాలని సిరిసిల్లలోని సీనియర్ అసిస్టెంట్ అంజయ్య ద్వారా లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయగా, రంగంలోకి దిగారు. వరంగల్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ మధుసూదన్ ఆధ్వర్యంలో బుధవారం ఏకకాలంలో దాడులు చేశారు.
సిరిసిల్ల జిల్లా మత్స్యశాఖ కార్యాలయంలో మత్స్యకారుడు జనార్దన్ నుంచి 10వేలు తీసుకుంటున్న సీనియర్ అసిస్టెంట్ అంజయ్యను, కరీంనగర్ జిల్లా కార్యాలయంలో మత్స్యకారుడు నర్సయ్య నుంచి 40వేలు తీసుకుంటున్న డీడీ ఖదీర్ అహ్మద్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నగదును స్వాధీనం చేసుకుని చేసుకున్న తర్వాత ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఖదీర్ అహ్మద్కు సంబంధించిన సప్తగిరికాలనీలోని ఆయన ఇళ్లు, సుభాష్నగర్లోని అంజయ్య ఇంట్లో కూడా సోదాలు చేశారు. పట్టుబడిన ఇద్దరు నిందితులను విచారణ అనంతరం కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు ఏసీబీ డీఎస్పీ మధుసూదన్ తెలిపారు.
వేధింపులు భరించలేకే
మానేరులో చేపల ఉత్పత్తి పెరిగింది. మాకు ఉపాధి లభించింది. పురుషులంతా చేపలు పడితే.. మహిళలు వాటిని మార్కెట్లో అమ్ముతున్నరు. అయితే చేపల విక్రయం కోసం మహిళా మత్స్య సహకార సంఘం ఏర్పాటు కోసం అధికారుల వద్దకు వెళ్తే లంచం అడిగిన్రు. మేం ఇచ్చుకోలేమని ఎంత బతిమిలాడినా కనికరించలేదు. వాళ్ల వేధింపులు భరించలేకనే ఇద్దరం కలిసి ఏసీబీ అధికారులను ఆశ్రయించినం.