ప్యోంగ్యాంగ్: తమ దేశం ఇప్పటికీ కరోనా రహితమని ఉత్తర కొరియా మరోసారి ప్రకటించింది. మహమ్మారి ఉనికిలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో)కు బుధవారం తెలిపింది. సరిహద్దులు మూసివేయడం, పర్యాటకులపై నిషేధం విధించడం, దౌత్యవేత్తలను పంపివేయడంతో పాటు పటిష్ఠమైన కరోనా నియంత్రణ చర్యల వల్ల ఇది సాధ్యమైందని పేర్కొంది.
కరోనా ఉనికిలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 23,121 మంది ప్రజలకు కరోనా పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ ఫలితం వచ్చినట్లు తెలిపింది. ఈ ఏడాది మార్చి 26 నుంచి ఏప్రిల్ 1 వరకు కూడా 732 మందికి కరోనా పరీక్షలను ఉత్తర కొరియా నిర్వహించిందని ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని ఆ దేశానికి చెందిన డబ్ల్యూహెచ్వో ప్రతినిధి ఎడ్విన్ సాల్వడార్ వెల్లడించారు. ఈ మేరకు అసోసియేటెడ్ ప్రెస్కు బుధవారం ఈమెయిల్ చేశారు.
మరోవైపు ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు నమోదు కాలేదన్న ఉత్తర కొరియా మాటలను ప్రపంచం విశ్వసించడం లేదు. ఆ దేశంలో సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం, ప్రజల ఆర్థిక జీవన పరిస్థితులు, చైనా సరిహద్దులో ఎలాంటి నిఘా లేకపోవడం వంటివి దీనికి కారణంగా కనిపిస్తున్నాయి. కాగా, కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో తమ దేశ క్రీడాకారులను టోక్యో ఒలింపిక్స్కు పంపడం లేదని ఉత్తర కొరియా మంగళవారం ప్రకటించింది.