న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: చిన్న మొత్తాల పొదుపుపై వడ్డీరేట్ల తగ్గింపులో మోదీ సర్కారు వెనక్కి తగ్గింది. వడ్డీ కోతల నిర్ణయం తీసుకున్న 12 గంటల్లోపే యూటర్న్ చేసుకున్నది. పైగా దీన్ని పర్యవేక్షణ లోపంగా అభివర్ణించింది. ఈ క్రమంలోనే తమ ఈ పొరపాటు నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు గురువారం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. అయితే బెంగాల్, అస్సోంసహా మరో 3 రాష్ర్టాల్లో ఎన్నికల నేపథ్యంలో మా త్రం ఈ వ్యవహారం అత్యం త ప్రాధాన్యతను సంతరించుకున్నది. కాగా, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్ఎస్సీ) తదితర ప్రభుత్వ చిన్న మొత్తాల పొదుపు పథకాలపై ఇస్తున్న వడ్డీరేట్లను బుధవారం కేంద్రం భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. పీపీఎఫ్, ఎన్ఎస్సీతోపాటు ఏడాది నుంచి ఐదేండ్ల టర్మ్ డిపాజిట్లు, ఐదేండ్ల రికరింగ్ డిపాజిట్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్స్, మంత్లీ ఇన్కమ్ అకౌంట్, కిసాన్ వికాస్ పత్ర వడ్డీరేట్లను ఏకంగా 1.1 శాతం వరకు కోత పెట్టారు. ఇటీవలి కాలంలో ఈ స్థాయిలో తగ్గింపు ఇదే తొలిసారి. ఈ క్రమంలో మార్చి 31 నాటికి ఉన్న వడ్డీరేట్లే ఈ ఏప్రిల్-జూన్ త్రైమాసికానికీ వర్తిస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.
సామాన్యులకు అత్యంత అనుకూలమైన చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీరేట్లను పెద్ద ఎత్తున తగ్గించడంపట్ల ప్రభుత్వంపై ప్రింట్-ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాల్లో పెద్ద ఎత్తున వార్తలు, విమర్శలు వచ్చాయి. దీనికితోడు పలు రాష్ర్టాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటం, ముఖ్యంగా బెంగాల్లో మమతా బెనర్జీతో సమరాన్ని బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడం మధ్య వడ్డీరేట్ల కోతలు గెలుపు అవకాశాలను దెబ్బ తీస్తాయన్న అంచనాలనూ కేంద్రం పరిగణనలోకి తీసుకోవచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అందుకే ఆగమేఘాలపై నిర్ణయాన్ని వెనక్కి తీసుకుందంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ స్పందిస్తూ కోట్లాది ప్రజల జీవితాలను ప్రభావితం చేసే నిర్ణయాన్ని పొరపాటుగా తీసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నది. దీన్నో ఎన్నికల స్టంట్గా పేర్కొన్నది.