ఐపీఎల్ 2021 సీజన్ ఆరంభానికి ముందే చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) ఫ్రాంఛైజీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ప్రధాన పేసర్ జోష్ హేజిల్వుడ్ ఈ ఏడాది ఐపీఎల్ నుంచి వైదొలిగాడు. ఐపీఎల్లో పాల్గొనే ఆస్ట్రేలియా ఆటగాళ్లతో కలిసి హేజిల్వుడ్ ఇవాళ భారత్కు బయలుదేరాల్సి ఉంది.
తన కుటుంబంతో గడపడానికి ఈ ఏడాది ఐపీఎల్ నుంచి తప్పుకోవాలని జోష్ నిర్ణయించుకున్నాడు. ‘వివిధ సందర్భాల్లో గత 10 నెలల నుంచి బయో బబుల్, క్వారంటైన్లో ఉంటూ వస్తున్నాను. అందుకే కొంతకాలం క్రికెట్ నుంచి విరామం తీసుకొని ఇంట్లో కుటుంబ సభ్యులకు సమయం కేటాయించాలనుకుంటున్నట్లు’ హేజిల్వుడ్ పేర్కొన్నాడు.
ఐతే హేజిల్వుడ్ ఐపీఎల్ నుంచి తప్పుకోవడంపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. చెన్నై జట్టులో పుజారా ఉన్నాడు కాబట్టే జోష్ ఈ నిర్ణయం తీసుకున్నాడని ఫన్నీ సెటైర్లు, మీమ్స్తో ట్వీట్లు చేస్తున్నారు. టెస్టు స్పెషలిస్ట్గా పేరొందిన పుజారాకు నెట్స్లో బంతులేయడం తన వల్ల కాదని హేజిల్వుడ్ భయపడి ఉంటాడని ఓ నెటిజన్ వ్యాఖ్యానించాడు.