సాగుచేసే వారికి ఆర్థికాభివృద్ధి పరంగా ఉజ్వల భవిష్యత్తు
ఎకరాకు రూ.30 వేల ప్రోత్సాహం అందిస్తాం..
వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి
ఆయిల్పామ్ సాగులో సిద్దిపేట అగ్రస్థానంలోనిలవాలి
నర్మెట వద్ద ఫ్యాక్టరీ ఏర్పాటుకు కృషి
ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు
సిద్దిపేటలో అవగాహన సదస్సు విజయవంతం
భారీగా తరలివచ్చిన రైతులు
సిద్దిపేట అర్బన్/కలెక్టరేట్, మార్చి 28 : రాష్ట్రంలో ఆయిల్పామ్ సాగుచేసే రైతులకు ఉజ్వల భవిష్యత్తు ఉందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ఆయిల్పామ్ సాగుపై ఆదివారం రైతులకు సిద్దిపేట జిల్లాకేంద్రంలోని భైరి అంజయ్య గార్డెన్లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో మంత్రులు తన్నీరు హరీశ్రావు, సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో వ్యవసాయశాఖకు రూ.25 వేల కోట్లు కేటాయించినందుకు ముందుగా సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. రాష్ట్రంలో 2.40 కోట్ల మంది జనాభా వ్యవసాయానికి అనుబంధంగా ఉన్నారన్నారు. యాసంగిలో 52 లక్షల్లో వరి సాగుచేశామని, సాగునీటి ప్రాజెక్టులు పూర్తయితే ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. భవిష్యత్తులో మొత్తం వరి లేదా ఇతర పంటలు సాగు చేయడంతో సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని, వాటిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగుపై దృష్టి కేంద్రీకరించిందని తెలిపారు. దేశంలో 21 మిలియన్ టన్నుల నూనె అవసరం కాగా, ఏటా కేంద్ర ప్రభుత్వం రూ.90వేల కోట్ల ఆయిల్ దిగుమతి చేసుకుంటుందన్నారు.
ఆయిల్ పామ్ సాగు అత్యంత సులభమైన పంటతో పాటు చీడపీడలు, కోతులు, రాళ్లవాన, దొంగల బెడద ఉండక పోగా, స్థిరమైన లాభం కలిగిన పంట అని తెలిపారు.
నేడు 70 లక్షల ఎకరాల్లో సాగు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. రాష్ట్రంలో 8 లక్షల ఎకరాలకు అనుమతి ఇచ్చిందని, భవిష్యత్తులో దాన్ని పెంచేందుకు ఎంతో కృషి చేస్తున్నామని మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. ఆయిల్ పామ్ పంట సాగు చేసిన తర్వాత దళారీ వ్యవస్థ ఉండదన్నారు. పంటకు ఎకరం భూమిలో అయ్యే ఖర్చులో రూ.30 వేలు ప్రభుత్వం సబ్సిడీ అందజేస్తుందని తెలిపారు. ఆయిల్పామ్ సాగులో అంతర పంటగా ఏదైనా వేసుకోవచ్చని సూచించారు. జిల్లాలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని, రైతులు ఎవరూ అధైర్యపడవద్దని అన్నారు. రైతులకు నాబార్డు ద్వారా రుణాలు అందజేస్తామని తెలిపారు. ఆయిల్పామ్ సాగుకు మంచి భవిష్యత్తు ఉందని మంత్రి తెలిపారు. సదస్సులో ఎమ్మెల్సీలు రఘోత్తంరెడ్డి, ఫారూఖ్హుస్సేన్, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్రెడ్డి, రాష్ట్ర అటవీ అభివృద్ది సంస్థ చైర్మన్ ప్రతాప్రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ వంగ నాగిరెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ పద్మాకర్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్కుమార్, జిల్లా ఉద్యానవవ అధికారి రామలక్ష్మి, వ్యవసాయ శాఖ, ఉద్యావన శాఖ అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
మెగ్నీషియంతో నిద్రలేమి సమస్య దూరం..!
షుగర్ ఉన్నోళ్లు ఈ పండ్లు తినొచ్చా