హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): టీబీ వ్యాధి నివారణలో తెలంగాణ ప్రభుత్వ చర్యలు అద్భుత ఫలితాలిస్తున్నాయి. బాధితులను గుర్తించి అత్యుత్తమ చికిత్స అందిస్తుండటంతో వ్యాధి తగ్గుముఖం పడుతున్నది. ఈ మొండివ్యాధి నివారణలో దేశంలోనే మనరాష్ట్రం రెండోస్థానంలో నిలిచి టీబీ ఫ్రీ రాష్ట్రంగా అవతరించేందుకు అడుగులు వేస్తున్నది. టీబీ నివారణలో 2019లో నాలుగోస్థానంలో ఉన్న మన రాష్ట్రం 2020లో రెండోస్థానానికి చేరింది. 2020లో రాష్ట్రంలో 62,342 టీబీ కేసులను గుర్తించారు. 72 వేల కేసులను గుర్తిం చి చికిత్స అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నా కరోనా వల్ల సాధ్యపడలేదు. ఈ ఏడాది 80వేల కేసులు గుర్తించే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. దేశంలో ప్రతి లక్ష మందిలో 203 టీబీ కేసులు ఉండవచ్చని కేంద్రప్రభుత్వం అంచనావేసింది. వీరిని సకాలంలో గుర్తించి చికిత్స అందిస్తేనే వ్యాధి వ్యాప్తిని అరికట్టే వీలుంటుంది. ఇందుకోసం అధికారులు కృషిచేస్తున్నారు.
ఉమ్మడి ఖమ్మం, నిజామాబాద్ ముందంజ
నిజామాబాద్, కామారెడ్డి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు టీబీ నివారణ లక్ష్యంలో తొలిస్థానంలో నిలిచాయి. ఒక జిల్లా, ఒక రాష్ట్రం టీబీ రహితమని ప్రకటించాలంటే కేసు ల్లో 80 శాతం తగ్గుదల ఉండాలి. తాజాగా ఈ జిల్లాలు టీబీ నివారణలో గణనీయమైన ప్రగతి సాధించినట్టు కేంద్ర బృందం ప్రకటించింది. ఫిబ్రవరి 18, 19 తేదీల్లో కేంద్ర ఆరోగ్యశాఖ నిపుణుల కమిటీ ఈ నాలుగు జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదిక రూపొందించింది.