ముంబై: మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్పై ముంబై పోలీస్ మాజీ కమిషనర్ పరంబీర్ సింగ్ చేసిన ఆరోపణలు తీవ్రమైనవని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. ఈ ఆరోపణలపై దర్యాప్తునకు, హోంమంత్రిపై చర్యలకు నిర్ణయం తీసుకునే పూర్తి అధికారం సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు ఉన్నదని తెలిపారు. అనిల్ దేశ్ముఖ్పై ఈ సమయంలో అవినీతి ఆరోపణలు ఎందుకు వచ్చాయో చూడాల్సి ఉందన్నారు. మహారాష్ట్రలోని సంకీర్ణ ప్రభుత్వానికి కూల్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా లేదా అన్నది తనకు తెలియదని అన్నారు. అయితే ప్రభుత్వంపై ఎలాంటి ప్రభావం లేదని చెప్పారు.
ముఖేష్ అంబానీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీస్ అధికారి సచిన్ వాజేను నెలకు వంద కోట్లు వసూలు చేయాలని హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ డిమాండ్ చేసినట్లు ముంబై పోలీస్ మాజీ కమిషనర్ పరంబీర్ సింగ్ శనివారం ఆరోపించారు. ఎన్సీపీకి చెందిన హోంమంత్రిపై అవినీతి ఆరోపణలు రావడంతో శరద్ పవార్ స్వయంగా రంగంలోకి దిగారు. పార్టీ మంత్రులు, సీనియర్ నేతలను ఢిల్లీకి పిలిచారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అజిత్ పవార్, మంత్రి జయంత్ పాటిల్ ఆదివారం ఢిల్లీ వెళ్లి పవార్ను కలవనున్నారు. శివసేన నేత సంజయ్ రౌత్ కూడా ఆయనతో భేటీ అవుతారని తెలుస్తున్నది.