న్యూఢిల్లీ: రిలయన్స్ రిటైల్లో తమ సంస్థ విలీనంపై ముందుకు వెళ్లరాదని ఢిల్లీ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను ఫ్యూచర్స్ రిటైల్స్.. డివిజన్ బెంచ్లో సవాల్ చేయనున్నట్లు తెలుస్తున్నది. సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ (ఎస్ఐఏసీ) జారీ చేసిన అత్యవసర అవార్డును ఉల్లంఘించినందుకు రూ.20 లక్షలు డిపాజిట్ చేయాలని, వచ్చేనెలలో జరిగే తదుపరి విచారణకు ఫ్యూచర్స్ ఎండీ కం సీఈవో కిశోర్ బియానీ, డైరెక్టర్లను హాజరు కావాలని ఢిల్లీ హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశించిన సంగతి తెలిసిందే. కిశోర్ బియానీ, తదితరులను అరెస్ట్ చేయాలని ఎందుకు ఆదేశించకూడదని ప్రశ్నించింది. సింగపూర్ కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు ప్రధాని రిలీఫ్ ఫండ్ కింద రూ.20 లక్షలు డిపాజిట్ చేయాలని ఆదేశించింది.
సింగిల్ బెంచ్ ఆదేశాలపై సోమ, మంగళవారాల్లో డివిజన్ బెంచ్ ముందు పిటిషన్ దాఖలు చేసి, త్వరితగతిన విచారించాలని ఫ్యూచర్స్ కోరనున్నదని సమాచారం. గతేడాది అక్టోబర్లో రిలయన్స్ రిటైల్లో తమ ఫ్యూచర్స్ సంస్థ పూర్తిగా విలీనం చేసేందుకు రూ.24,713 కోట్లతో కిశోర్ బియానీ ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. దీనిపై ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్.. అటు సింగపూర్ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కోర్టు, ఇటు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. 2019లో ఫ్యూచర్స్ కూపన్స్లో పెట్టుబడులు పెట్టినప్పుడు భవిష్యత్లో సంస్థలో వాటాలను విక్రయిస్తే.. తమకే విక్రయించాలన్న నిబంధనను అమెజాన్.. ఫ్యూచర్స్ కూపన్స్తో ఒప్పంద సమయంలో చేర్చింది.