హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): సంక్షేమ, సేవా రంగాలకు ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యమిచ్చింది. రూ.73 వేల కోట్లు.. అంటే రాష్ట్ర బడ్జెట్లో 31 శాతానికిపైగా సంక్షేమ రంగానికి కేటాయించి దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచింది. ఆసరా పింఛన్లను తామే ఇస్తున్నామని చెప్పుకున్నవారికి అంకెలతో సహా వాస్తవాలను ప్రజల ముందుపెట్టింది. ఆసరా ఫించన్లలో కేంద్రం వాటా 1.20 శాతం మాత్రమేనని తెలిపింది. 98.80 శాతం అసహాయులకు రాష్ట్రప్రభుత్వమే ఆసరాగా నిలుస్తున్నదని బడ్జెట్లో స్పష్టం చేసింది. కల్యాణలక్ష్మి/షాదీముబారక్ పథకానికి గత బడ్జెట్ కన్నా అధిక నిధులు కేటాయించింది. ఎస్సీ, బీసీ, మైనార్టీ, ఎస్టీ వర్గాల అభ్యున్నతికి నిర్మాణాత్మక పద్దులు కేటాయించటమే కాకుండా ఆయావర్గాల సంక్షేమానికి భారీ నిధులను వెచ్చించనుంది. కొనసాగుతున్న పథకాలకు ఉదారంగా నిధులు కేటాయిస్తూనే కొత్త పథకాలకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోఉన్నవారికే కాకుండా బతుకుదెరువు కోసం గల్ఫ్దేశాలకు వెళ్లినవారి సంక్షేమానికి ఈసారి బడ్జెట్ భరోసా ఇచ్చింది.
రాష్ట్రప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి/షాదీముబారక్ పథకానికి ఈ బడ్జెట్లో రూ.2,750 కోట్లు కేటాయించింది. ఇప్పటివరకు ఈ పథకం కింద 8,04,521 మంది ఆడబిడ్డల పెండ్లిండ్లకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించింది. అయితే, కల్యాణలక్ష్మిలో బీసీ సామాజికవర్గానికి చెందిన దరఖాస్తుల సంఖ్య ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ ఏడాది బడ్జెట్లో అదనంగా రూ.500 కోట్లు ప్రతిపాదించింది.
ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక నిధితోపాటు ఈసారి వెయ్యి కోట్లతో దళితుల అభ్యున్నతికి కొత్త పథకానికి ప్రభుత్వం రూపకల్పన చేసింది. త్వరలో రజకులకు అధునాతన దోభీఘాట్లను నిర్మిస్తామని, నాయీబ్రాహ్మణులకు ఆధునిక సెలూన్లను అందజేస్తామని స్పష్టంచేసింది. మరోవైపు రాష్ట్రంలో ఐదు జిల్లాల్లో రక్తహీనత అధికంగా ఉందని జాతీయ కుటుంబ సర్వే వెల్లడించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 9మంది ఉన్నతాధికారులను తమిళనాడు, కేరళ రాష్ర్టాలకు పంపింది. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా త్వరలో కొత్త కార్యక్రమాన్ని చేపడతామని స్పష్టంచేసింది.
తెలంగాణ నుంచి గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్లిన కార్మికుల సంక్షేమానికి, వారి సమస్యల పరిష్కారానికి త్వరలోనే ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కేరళ తరహాలో గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక కార్యాచరణను తయారు చేసి అమలుచేయాలని నిర్ణయించింది. కేరళ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని అధ్యయనం చేయటానికి ఉన్నతాధికారుల బృందాన్ని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పంపింది. ఈ బృందం సమర్పించిన నివేదిక ఆధారంగా గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్యాచరణను చేపట్టనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
రాష్ట్రంలో 39.36 లక్షల మందికి అందిస్తున్న ఆసరా పింఛన్ల కోసం ఈ ఏడాది బడ్జెట్లో రూ.11,728 కోట్లు కేటాయించారు. ఆసరా పింఛన్ల కింద ప్రభుత్వం ప్రతినెలా వికలాంగులకు రూ.3,016, ఇతర వర్గాలకు రూ.2,016 అందిస్తున్నది. ఇందులో కేంద్రంవాటా 1.20 శాతం మాత్రమే. మిగిలిన 98.80 శాతం రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తున్నది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.200 చొప్పున 6.66 లక్షల మందికి రూ.105 కోట్ల సాయం అందించింది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 39.36 లక్షల మందికి నెలకు రూ.2,016, వికలాంగులకు రూ.3,016 చొప్పున ఇస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో పింఛన్ను రూ.200 మాత్రమే ఇచ్చేవారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మొదటిసారి అధికారంలోకి వచ్చాక సీఎం కేసీఆర్ రూ.200 ఉన్న పింఛన్ను రూ.1000కి పెంచారు. రెండోసారి ఎన్నికయ్యాక ఆ మొత్తాన్ని రెట్టింపు చేశారు.