హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): విదేశాల్లో ఉద్యోగం అంటూ ఊదరగొట్టి పెండ్లి చేసుకొని.. ఏదో సాకుతో ముఖం చాటేస్తున్న ఎన్నారై భర్తలకు బ్యాండ్బాజా మోగిస్తున్నారు తెలంగాణ పోలీసులు. నిందితులు విదేశాల్లో ఉండటంతో వారిపై ఎవరికి, ఎలా ఫిర్యాదు చేయాలో తెలియక బాధితులకు దిక్కుతోచని స్థితి ఉండేది. వాటన్నింటికీ పరిష్కారంగా తెలంగాణ పోలీసులు మహిళా భద్రత విభాగం ఆధ్వర్యంలో డీజీపీ మహేందర్రెడ్డి, అడిషనల్ డీజీ స్వాతిలక్రా 2019 జూలై 17న ప్రత్యేకంగా ఎన్నారైసెల్ను ఏర్పా టు చేశారు. ఎన్నారై మహిళల భద్రత కోసమే ఈ ప్రత్యేక విభాగం పనిచేస్తున్నది. ఇప్పటివరకు 900 వరకు కేసులు నమోదుకాగా, వీటిలో నేరుగా ఎన్నారై సెల్కు 176 ఫిర్యాదులు రావడం గమనార్హం.
విదేశాల్లోని చట్టాలకు మన చట్టాలకు మధ్య వ్యత్యాసాలు ఉంటున్నాయి. వీటిని ఆయా దేశాల్లోని ఎన్నారై భర్తలు అవకాశంగా తీసుకుంటున్నారు. ముఖ్యంగా బాధితులందరినీ ఏకతాటిపైకి తెచ్చి వారిలో మనోైస్థెర్యాన్ని నింపేందుకు ఓ వాట్సాప్ గ్రూప్ను ఏర్పాటు చేశారు. బాధితులతో జాతీయ మహిళా కమిషన్, కేం ద్రం హోంశాఖ, విదేశీ వ్యవహారాలశాఖ, రీజినల్ పాస్పోర్టు కార్యాలయాలు, ఆయా దేశాల్లోని రాయబార కార్యాలయాలు ఇలా అన్నింటికీ ఫిర్యాదులు చేయిస్తున్నారు. బాధితులతో ఆయా దేశాల ఎంబసీ ప్రతినిధులకు వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తున్నట్టు డీఐజీ సుమతి తెలిపారు. ఇప్పటికే కెనడా ఎంబసీ అధికారులతో వర్చువల్ సమావేశంలో 21 కేసుల గురించి చర్చించినట్టు తెలిపారు. యూఎస్, ఆస్ట్రేలియా ఎంబసీ అధికారులు సైతం వర్చువల్ సమావేశాలు నిర్వహించేందుకు సానుకూలత వ్యక్తం చేసినట్టు తెలిపారు. నిందితులు ఏ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నారో తెలుసుకుని.. అక్కడి యాజమాన్యాలకు కేసుల విషయాన్ని తెలియజేస్తున్నామని.. అందరి సమన్వయంతో లుక్అవుట్ సర్క్యులర్ జారీ చేస్తున్నట్టు చెప్పారు.
అల్వాల్, ఆర్సీపురం, ఖమ్మం మహిళా పోలీస్స్టేషన్లలో నమోదైన మూడు కేసుల్లో ఎన్నారై సెల్ అధికారులు రాజీ కుదిర్చారు. 24 కేసు లు ఇరువర్గాల ఒప్పందంతో మూసివేశారు. 66 కేసుల్లో నిందితులపై లుక్ అవుట్ సర్క్యులర్ అమల్లో ఉన్నాయి. 35 కేసుల్లో నిందితులపై ఎల్ఏసీ జారీకి సిద్ధంగా ఉన్నాయి. ఎనిమిది కేసుల్లో నిందితుల పాస్పోర్టులు స్వాధీనం చేసుకున్నారు.
1.అదనపు కట్నం, 2.పెండ్లికి ముందు ఆస్తులున్నట్టుగా అబద్ధాలు చెప్పడం.. తీరా పెండ్లి తర్వాత అసలు విషయాలు బయటికి రావడం 3. విదేశంలో వేరే మహిళతో సహజీవనం చేస్తూ.. తల్లిదండ్రుల ఒత్తిళ్లకు తలొగ్గి ఇక్కడికి వచ్చి పెండ్లి చేసుకోవడం.
ఫిబ్రవరి 2021 వరకు నమోదైన మొత్తం ఫిర్యాదులు: 176
పెండింగ్ ట్రయల్లో ఉన్నవి: 96
దర్యాప్తులో ఉన్నవి: 48
ఇప్పటికే క్లోజ్ అయిన కేసులు: 24
కేసులు నమోదు చేయనివి: 08