వాషింగ్టన్: అమెరికన్లకు సెర్చింజన్ గూగుల్ తీపి కబురందించింది. ఈ ఏడాదిలో దేశవ్యాప్తంగా 700 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. తద్వారా విభిన్న రంగాల్లో 10 వేల మంది నిపుణులకు కొత్తగా ఉద్యోగాలు కల్పిస్తామని పేర్కొన్నారు. అమెరికాలోని ఆఫీసులు, డేటా సెంటర్లలో ఈ పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించారు.
కరోనా నుంచి అమెరికా ఆర్థిక వ్యవస్థ రికవరీలో తాము భాగస్వామ్యం కావాలని నిర్ణయించుకున్నట్లు సుందర్ పిచాయ్ తెలిపారు. 19 రాష్ట్రాల్లో ఈ పెట్టుబడులను పెడతామని వివరించారు. సొంత రాష్ట్రం కాలిఫోర్నియాలోనే 100 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు గూగుల్ తెలిపింది. శాన్ఫ్రాన్సిస్కో బే ఆవల అట్లాంటా, వాషింగ్టన్ డీసీ, చికాగో, న్యూయార్క్లలో నూతన పెట్టుబడులతో వేల మందికి ఉద్యోగాలు వస్తాయని వెల్లడించింది.