సిటీబ్యూరో, మార్చి 17( నమస్తే తెలంగాణ): ‘మహిళలు కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి అహర్నిశలు పాటుపడటానికే పరిమితమవకుండా.. మీ ఆరోగ్యం గురించి కూడా ఓసా రి ఆలోచించుకోవాలి’ అని హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి అన్నారు. మహిళలు క్యాన్సర్ బారిన పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎంజే క్యాన్సర్ దవాఖాన ఆధ్వర్యంలో బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్స ర్ పరీక్షా శిబిరాన్ని బుధవారం కలెక్టర్ ప్రారంభించారు. కలెక్టరేట్ ఉద్యోగులకు జిల్లా దవాఖాన కింగ్ కోఠిలో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళలు తమ ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహించడం శ్రేయస్కరం కాదని అన్నారు. ఇంట్లో మహిళలు కుటుంబ సభ్యుల ఆరోగ్య బాధ్యతలు తీసుకుంటారనీ.. తమ ఆరోగ్యం గురించి మాత్రం పట్టించుకోరని చెప్పారు. దేశంలో క్యాన్సర్తో చనిపోయిన చాలా మందిని పరిశీలిస్తే ఆలస్యంగా జబ్బును గుర్తించిన కారణంగానే మరణించారని తెలిపారు. 30 శాతం మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ బారిన పడుతున్నారని, క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ చెప్పారు. డీఎంహెచ్వో డాక్టర్ వెంకటి, డీసీహెచ్ సునీత, ఆర్ఎంవో నిర్మల, దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల కలెక్టర్ శ్వేతా మహంతి కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. నగరంలోని కింగ్ కోఠి దవాఖానలో బుధవారం కొవాగ్జిన్ తీసుకున్నారు. డీఎంహెచ్వో డాక్టర్ వెంకటి, దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్రనాథ్ ఆధ్వర్యంలో వాక్సినేషన్ జరిగింది. టీకా అనంతరం ఆమె ధైర్యంగా.. నవ్వులు పూయిస్తూ కనిపించింది. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.