కాజీపేట, మార్చి 17 : ఐక్య పోరాటాలతో కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, రైల్వే డివిజన్ను సాధించుకుందామని పోరాట సమితి కన్వీనర్లు కొండ్ర నర్సింగరావు, దేవులపల్లి రాఘవేందర్, కర్ర యాదవరెడ్డి, గోపు సోమయ్య పిలుపునిచ్చారు. కాజీపేటలో బుధవారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పునర్విభజన చట్టంలో పొందుపర్చిన కోచ్ ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది లేదని చెప్పడమంటే తెలంగాణకు తీవ్ర అన్యాయం చేయడమేనన్నారు. రాష్ర్టానికి దక్కాల్సిన ఫ్యాక్టరీ కోసం ప్రజా పోరాటాలతో పాటు ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేసేందుకైనా సిద్ధపడి కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన అవసరముందన్నారు. అలాగే ఫ్యాక్టరీ ఇచ్చేది లేదనే కేంద్ర హోం శాఖ ప్రకటనను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ రైల్వేను ప్రైవేట్పరం చేయడం లేదని ఇటీవల లోక్సభలో పేర్కొన్నారని, కానీ దశలవారీగా రైల్వే విభాగాలను ప్రైవేట్ చేస్తున్నారని దీని వల్ల దేశంలోని సామాన్య ప్రజలు తీవ్ర అన్యాయానికి గురవుతారన్నారు. కోచ్ ఫ్యాక్టరీ, రైల్వే డివిజన్ సాధనలో భాగంగా పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ నెల 24న హైదరాబాద్లోని ఇందిరా పార్కులో, ఏప్రిల్ 5న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టే సాధన దీక్షకు ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో బండి దుర్గాప్రసాద్, కొత్తపల్లి సావిత్రి, రేండ్ల రమేశ్, పాక వేదప్రకాశ్, అప్పారావు, గడ్డం అశోక్, సోమ రాంమూర్తి పాల్గొన్నారు.