తిరుమలగిరి, మార్చి15 : పల్లెప్రగతి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నా.. మండలంలోని గుండెపురి గ్రామ పంచాయతీలో మాత్రం అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉంది. డ్రెయినేజీలు, రోడ్లు సక్రమంగా లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. హరితహారం కింద నాటిన మొక్కలు సంరక్షణ లేక చనిపోతున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. అభివృద్ధి పనులు కూడా నత్తనడకన సాగుతున్నాయి. గుండెపురి గ్రామంలో 325 ఇండ్లు, 1,411 మంది జనాభా ఉన్నారు. పల్లె ప్రగతి కింద ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.15 లక్షలకు పైగా నిధులను విడుదల చేసింది. అయినా సమస్యలు రాజ్యమేలుతున్నాయి.
హరితహారంలో భాగంగా గ్రామం నుంచి ప్రధాన రహదారి వరకు రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు. దీంతో పాటు తుంగతుర్తి, వెలిశాల రోడ్డు వెంట మొక్కలు నాటారు. కానీ వాటి సంరక్షణను విస్మరించడంతో చాలా మొక్కలు చనిపోయాయి. చాలా మొక్కలు పశు వులకు ఆహారంగా మారాయి. ప్రస్తుతం ఉన్నవి కూడా పెరగడం లేదు. గ్రామ పంచాయతీ చౌరస్తాలో కూడా మొక్క లు చనిపోగా వాటి స్థానంలో కొత్తవి నాటలేదు. ఎక్కడ చూసినా గుంతలే దర్శనమిస్తున్నాయి. ప్రతి రోజూ నీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ట్రాక్టర్, ట్యాంకర్ సమకూర్చినా మొక్కలకు నీరు పోసే దిక్కే లేకుండా పోయింది. ఎక్సైజ్శాఖ ఆధ్వర్యంలో హరితహారంలో వెయ్యికి పైగా ఈత మొక్కలు నాటగా ఒక్కటి కూడా బతకలేదు.
గ్రామంలోని అన్ని వీధుల్లో రోడ్లపైనే మురుగునీరు పారుతూ కనిపిస్తున్నది. డ్రైనేజీలు సక్రమంగా లేకపోవడంతో నీళ్లు రోడ్లపైకి చేరుతున్నాయి. దీంతో ప్రజలు నడిచేందుకు సైతం ఇబ్బంది పడాల్సిన దుస్థితి నెలకొంది. గ్రామంలో మొత్తం 8 వార్డులు ఉండగా నాలుగు వార్డుల్లో ఇదే పరిస్థితి. కాల్వల్లో నీరు నిలిచి దోమలు వృద్ధి చెందుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. పల్లెప్రగతిలో భాగంగా ప్రజల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వం సూచించినా అది అమలుకు నోచలేదు. గ్రామంలో ఇండ్ల ముందే పెంటకుప్పలు పోస్తున్నారు. ఈ విషయమై గ్రామస్తులకు సరైన అవగాహన కల్పించక పోవడంతో పరిస్థితి దారుణంగా మారింది.
గ్రామంలో నిర్మిస్తున్న వైకుంఠధామం పనులు నత్తనడకన సాగుతున్నాయి. 2016లో రూ.13 లక్షలతో చేపట్టిన గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులు నేటికీ పూర్తి కాలేదు. ఫలితంగా శిథిలావస్థకు చేరిన భవనంలోనే పంచాయతీ పాలన సాగుతున్నది. డంపింగ్ యార్డు నిర్మించినా దానిని వినియోగించడం లే దు. గ్రామంలో ఉన్న నల్లాలకు ట్యాప్లు బిగించక పోవడంతో తాగునీరు వృథాఅవు తున్నాయి. చనిపోయిన మొక్కల స్థానంలో నాటడానికి తెచ్చిన ఈత మొక్కలు గ్రామపంచాయతీలోనే ఉంచి పట్టించుకోక పోవడంతో ఎండిపోయాయి.