కోల్కతా : ప్రధాని నరేంద్ర మోదీ అసమర్ధుడని ఆయన దేశాన్ని సమర్ధంగా ముందుకు తీసుకువెళ్లలేరని పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ విమర్శించారు. మోదీ నియంతలా వ్యవహరిస్తూ ఇష్టానుసారంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వంపై గళమెత్తిన పౌర సమాజాన్ని అణిచివేస్తున్నారని, రాజకీయ పార్టీలు మౌనం దాల్చేలా చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి దురాగతాలపై తన పోరాటం కొనసాగుతుందని బీజేపీ హఠావో..దేశ్ బచావో అని మమతా బెనర్జీ నినదించారు.
పురూలియా జిల్లాలో సోమవారం జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో దీదీ ప్రసంగించారు. తాము తిరిగి అధికార పగ్గాలు చేపడితే ఉచిత రేషన్ను అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. తృణమూల్ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిందని వివరించారు. గిరిజనులను ఆకట్టుకునేలా ఆమె పలు హామీలను గుప్పించారు. ఇక మార్చి 27 నుంచి ఎనిమిది దశల్లో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా మే 2న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.