హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 13 (నమస్తే తెలంగాణ): కరోనా మహమ్మారి తగ్గాక దేశంలో అద్భుతంగా పుంజుకున్న నగరంగా హైదరాబాద్ నిలుస్తున్నదని ఆర్థికమంత్రి హరీశ్రావు తెలిపారు. సొంతింటి కలను నిజం చేసుకొనేందుకు టీన్యూస్ నిర్వహిస్తున్న ప్రాపర్టీషో ఓ మంచి అవకాశమని చెప్పారు. శనివారం మాదాపూర్ హైటెక్స్లో టీన్యూస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రాపర్టీషోను టీ న్యూస్ సీజీఎం ఉపేందర్, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సురేశ్బాబు, ఇన్పుట్ ఎడిటర్ పీవీ శ్రీనివాసరావు, క్రెడాయ్ తెలంగాణ చైర్మన్ జీ రాంరెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. ప్రాపర్టీషోలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. అనంతరం హరీశ్రావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతున్నదని పేర్కొన్నారు. హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో అనేక మౌలిక వసతుల కల్పన జరిగిందని, మెరుగైన జీవనశైలితోపాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఎంతో పెరిగాయని తెలిపారు. ఇప్పటికే వందల మంది పెట్టుబడులు పెట్టారని.. మరింత మంది హైదరాబాద్ వైపే చూస్తున్నారని చెప్పారు. పెద్దపెద్ద నిర్మాణ సంస్థలు వెంచర్లు చేసేందుకు పోటీ పడుతున్నాయని తెలిపారు. రీజినల్ రింగ్రోడ్డు ప్రారంభమైతే రియల్ బూమ్ మరింత పెరిగే అవకాశం ఉన్నదనిచెప్పారు. ధరణి ద్వారా వ్యవసాయ భూముల సమస్యలు తీరుతున్నాయని, నాలా కన్వర్షన్ సులభంగా మారిందని పేర్కొన్నారు. ప్రజలు బంగారం కంటే ఎక్కువగా భూములపైనే పెట్టుబడి పెడుతున్నారని తెలిపారు. ఇలాంటి ప్రాపర్టీషోల ద్వారా రకరకాల ప్రాజెక్టుల వివరాలు ఒకేచోట తెలుసుకొని, నచ్చిన వాటిని సులభంగా కొనుగోలు చేసే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు.
పెట్టుబడులు నమ్మకంగా తిరిగి రావాలంటే రియల్ ఎస్టేట్ వ్యాపారంలోనే సాధ్యమని క్రెడాయ్ తెలంగాణ చైర్మ న్ జీ రాంరెడ్డి తెలిపారు. హైదరాబాద్ నగరం రియల్ ఎస్టేట్ రంగానికి పెద్ద డెస్టినేషన్గా మారిందని చెప్పారు. కరోనాతో రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉంటుందోనని అందరూ భయపడ్డారని.. కానీ, దేశంలోనే హైదరాబాద్లో త్వరగా మళ్లీ పుంజుకుంటున్నదని అన్నారు. టీన్యూస్ ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోకు వందలమంది నగరవాసులు వస్తుండటమే ఇందుకు ఉదాహరణ అని చెప్పారు. కార్యక్రమంలో క్రితికా డెవలపర్స్ సీఏవో అరుణ్, సువర్ణ భూమి ఇన్ఫ్రా డైరెక్టర్ శ్రీకాంత్, ఎస్బీఐ గృహ రుణాల విభాగం సికింద్రాబాద్ బ్రాంచ్ ఏజీఎం ఉషారాణితో పాటు పలువురు బిల్డర్లు పాల్గొన్నారు.