ఈ రోజుల్లో హీరోలు గీతా ఆర్ట్స్ లాంటి సంస్థలో ఒక సినిమా చేస్తేనే అదృష్టంగా భావిస్తూ ఉంటారు. అలాంటిది ఒక సినిమా విడుదల కాకముందే మరో సినిమా అవకాశం వస్తే అంతకంటే అదృష్టం మరొకటి ఉండదు. ఇప్పుడు హీరో కార్తికేయ విషయంలో ఇదే జరుగుతుంది. చావు కబురు చల్లగా సినిమాతో గీతాఆర్ట్స్ లోకి ఎంటర్ అయ్యాడు ఈ కుర్ర హీరో. కొత్త దర్శకుడు కౌశిక్ తెరకెక్కించిన ఈ సినిమా మార్చి 19 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇందులో బస్తీ బాలరాజు పాత్రలో కార్తికేయ అద్భుతంగా నటించాడు అని ఇప్పటికే అల్లు అర్జున్ సహా అల్లు అరవింద్ కూడా ప్రశంసల వర్షం కురిపించారు.
ఈ సినిమా తర్వాత కూడా నువ్వు మాకు అవసరం అంటూ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నవ్వుకుంటూ చెప్పాడు అల్లు అరవింద్. అయితే అది ఆ టైంకు చెబుతున్నాడు అని అందరూ అనుకున్నారు. ఇప్పుడు నిజంగానే ఈ కుర్ర హీరోతో మరో సినిమా చేయబోతున్నారు గీతా ఆర్ట్స్. నవంబర్లో ఈ సినిమా మొదలు కానుంది. ఈసారి కార్తికేయకు మరో బంపర్ ఆఫర్ కూడా ఉంది.
కేవలం గీతా ఆర్ట్స్ సంస్థనే కాకుండా సుకుమార్ రైటింగ్స్ కూడా ఇందులో భాగస్వామిగా ఉండబోతున్నారు. దాంతో బై వన్ గెట్ వన్ ఫ్రీ అన్నట్లు ఒకేసారి రెండు క్రేజీ నిర్మాణ సంస్థలతో కలిసి సినిమా చేయబోతున్నాడు కార్తికేయ. బన్నీ వాసు, సుకుమార్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించబోతున్నారు. దర్శకుడి వివరాలు ఇంకా బయటకి చెప్పలేదు. సుకుమార్ శిష్యుడు ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడని ప్రచారం జరుగుతుంది. ఏదేమైనా కూడా ఆర్ఎక్స్ 100 తర్వాత కెరీర్లో సరైన బ్రేక్ కోసం చూస్తున్న కార్తికేయకు గీతా ఆర్ట్స్ అద్భుతమైన బ్రేక్ ఇచ్చేలా కనిపిస్తుంది.