హైదరాబాద్ : అంతర్రాష్ట్ర దొంగల ముఠాను మేడ్చల్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వీరి నుంచి రూ. లక్షా 40 వేల నగదు, 3.5 తులాల బంగారం, సెల్ఫోన్లు, రెండు బైకులు, వెండి నాణేలు, కొడవళ్లు, కట్టర్లు, సుత్తెలు స్వాధీనం చేసుకున్నారు. ముఠాలో 11 మందిని అరెస్టు చేశామని, మరో నలుగురు పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఈ ముఠాలో దాదాపు 60 మంది ఉన్నట్లు సమాచారం ఉందని.. మిగిలిన వారు ఎక్కడున్నది పోలీసులు ఆరా తీస్తున్నారు.
సామాన్లు విక్రయించే నెపంతో కాలనీల్లో రెక్కీలు చేసి యజమానులు లేని ఇళ్లను ఎంచుకొని ఈ ముఠా దోపిడీలకు పాల్పడుతున్నది. ఎవరికీ అనుమానం రాకుండా కుటుంబాలతో వేర్వేరు ప్రాంతాల్లో తాత్కాలిక ఆవాసాలు ఏర్పాటు చేసుకుని ఉంటూ కాలనీల్లో చోరీలు కొనసాగిస్తున్నారని పోలీసులు వెల్లడించారు. పట్టుబడిన వారిని విచారిస్తున్నామని, పూర్తి వివరాలు త్వరలో మీడియాకు వెల్లడిస్తామని పేర్కొన్నారు.