వెల్లింగ్టన్: తొలి రెండు మ్యాచ్ల్లో విజయాలు సాధించి సిరీస్ సొంతం చేసుకునేలా కనిపించిన న్యూజిలాండ్ వరుసగా రెండో ఓటమి మూటగట్టుకుంది. శుక్రవారం ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టీ20లో కివీస్ 50 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. కెప్టెన్ ఆరోన్ ఫించ్ (55 బంతుల్లో 79; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధశతకంతో మెరువడంతో ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో న్యూజిలాండ్ 18.5 ఓవర్లలో 106 పరుగులకు ఆలౌటైంది. కైల్ జెమీసన్ (30) టాప్ స్కోరర్. ఆసీస్ బౌలర్లలో కేన్ రిచర్డ్సన్ 3, ఆగర్, మ్యాక్స్వెల్, జంపా తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఐదు మ్యాచ్ల సిరీస్లో ప్రస్తుతం ఇరు జట్లు 2-2తో సమంగా నిలిచాయి. మరోవైపు న్యూజిలాండ్ ప్రభుత్వం మైదానాల్లోకి ప్రేక్షకులను అనుమతివ్వనుండటంతో ఆదివారం ఆసీస్, కివీస్ మధ్య జరిగే ఫైనల్ టీ20 అభిమానుల సమక్షంలో జరుగనుంది.