సుమారు రూ.2వేల కోట్లు కేటాయింపు
త్వరలో ప్రభుత్వానికి నివేదిక, టెండర్ల ప్రక్రియ
ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్న సీఎం కేసీఆర్
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
హన్మకొండ, జూలై 19 : తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సోమవారం ఆయన కలెక్టరేట్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం కోసం రూపొందించిన ప్లాన్లను చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్తో కలిసి పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేనివిధంగా చరిత్రలో నిలిచిపోయేలా, అత్యాధునిక సాంకేతికతో, సుమారు రూ.2వేల కోట్లతో వరంగల్లో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించనున్నట్లు తెలిపారు. దీనికోసం ఇప్పటికే సెంట్రల్ జైలుకు సంబంధించిన 56ఎకరాల భూమిని సేకరించినట్లు చెప్పారు. మరికొంత సేకరించాలని అధికారులను ఆదేశించామన్నారు. సెంట్రల్ జైలే కాకుండా ఎంజీఎం, కంటి దవాఖాన, ఆటోనగర్, పారిశ్రామిక ప్రాంతం పరిధిలో భూ సేకరణ చేస్తున్నామని, ఇందుకోసం సమగ్ర భూసర్వే చేపట్టి వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ రాజీవ్గాంధీహన్మంతును కోరారు. దీని నిర్మాణం పూర్తయితే దేశంలోనే అతిపెద్ద హాస్పిటల్గా నిలుస్తుందన్నారు. చిన్నపిల్లల నుంచి మొదలుకొని ముసలోళ్ల వరకు అన్ని జబ్బులకు ఇక్కడే చికిత్స అందించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాజీవ్గాంధీహన్మంతు, డీఆర్వో వాసుచంద్ర, ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్కు మంత్రి కృతజ్ఞతలు
రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాల కుటుంబాల సమగ్రాభివృద్ధికి రూపొందించిన దళిత బంధు పథకాన్ని హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని నిర్ణయించిన సీఎం కేసీఆర్కు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కృతజ్ఞతలు తెలిపారు. దేశంలోనే మొదటి సారిగా షెడ్యూల్డ్ కులాల కోసం దళిత బంధు పథకం అమలు చేయాలని కేసీఆర్ తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైందని, చరిత్రలో గొప్ప మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. దళితుల జీవితాల్లో వెలుగులు నిం పిన నేతగా కేసీఆర్ తరతరాలకు గుర్తుంటారని పేర్కొన్నారు. హుజూరాబాద్ నుంచి ప్రారంభించిన రైతుబం ధు విజయవంతమైనట్లే దళిత బంధు సక్సెస్ అవుతుందని మంత్రి ఎర్రబెల్లి ఆశాభావం వ్యక్తం చేశారు.