ఏడీ డాక్టర్ జే రవికుమార్
పరకాల/రాయపర్తి, జూలై 6: పెంపుడు జంతువులకు తప్పనిసరిగా టీకాలు వేయించాలని పశుసంవర్థక శాఖ ఏడీ డాక్టర్ జే రవికుమార్ అన్నారు. వరల్డ్ జునోసిస్ డేను పురస్కరించుకుని మంగళవారం పెంపుడు జంతువులకు టీకాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేబిస్ వ్యాధికి టీకా కనుగొన్న జూలై 6ను వరల్డ్ జునోసిస్ డేగా జరుపుకుంటున్నట్లు తెలిపారు. పెంపుడు జంతువుల నుంచి మనుషులకు చాలా రకాల జబ్బులు వస్తున్నాయని, వీటిని అరికట్టేందుకు పరిశుభ్రత పాటించడంతో పాటు వ్యాక్సిన్ వేయించాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తిరునహరి శేషాంజన్స్వామి, దార్న కుమారస్వామి, జయప్రకాశ్ పాల్గొన్నారు.
జంతు సంరక్షణకు సర్కారు కృషి
రాయపర్తి: రాష్ట్రంలో జంతు సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి తెలిపారు. మండలకేంద్రంలోని పశు వైద్యశాలలో పెంపుడు కుక్కలకు రేబిస్ టీకా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. వ్యవసాయ రంగానికి అనుబంధంగా ఉన్న పశు సంరక్షణ, జంతు జాతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఏటా కోట్లాది రూపాయల వ్యయంతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. మండల పశువైద్యాధికారి వీరగోని శ్రుతి, సర్పంచ్ గారె నర్సయ్య, ఎంపీటీసీ అయిత రాంచందర్, తౌటు గణేశ్, పులి శ్రీనివాస్గౌడ్, కొమురయ్య పాల్గొన్నారు.