వ్యవసాయాన్ని పండుగలా మార్చిన ఘనత సీఎందే..
ప్రాజెక్టులతో సాగుకు స్వర్ణయుగం
మహిళలు ఆర్థిక ప్రగతి సాధించాలి
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
పాలకుర్తి, కొడకండ్లలో డీసీసీబీ బ్రాంచ్ల ప్రారంభం
పాలకుర్తి రూరల్/కొడకండ్ల, జూలై 4 : సీఎం కేసీఆర్ పాలనలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని, తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశానికే ఆదర్శమని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఆదివారం పాలకుర్తి, కొడకండ్ల మండల కేంద్రాల్లో కొత్తగా డీసీసీబీ బ్రాంచ్లను చైర్మన్ మార్నేని రవీందర్రావుతో కలిసి ప్రారంభించారు. మహిళా సంఘాలకు రూ.5 కోట్ల రుణాలు పంపిణీ చేశారు. అనంతరం ఎర్రబెల్లి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతును రాజు చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. నాడు వ్యవసాయాన్ని దండుగ అన్నా పాలకులకు నేడు వ్యవసాయం పండుగ అని నిరూపించిన మహాత్ముడు కేసీఆర్ అని కొనియాడారు. ఉమ్మడి వరంగల్ జిల్లా రానున్న రోజుల్లో మరో కోనసీమగా మారుతుందన్నారు. ఒకప్పుడు కరువు తాండవించిన జనగామ ప్రాంతం ఇప్పుడు సస్యశ్యామలం అయిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో సాగుకు స్వర్ణయుగం వచ్చిందన్నారు. అర్హులైన ప్రతి రైతుకూ రుణం అందించాలని డీసీసీ బ్యాంక్ పాలకవర్గం, అధికారులను ఆదేశించారు. పాలకుర్తి, కొడకండ్లలో బ్యాంక్ సేవలు అందిస్తున్నందుకు అభినందనలు తెలిపారు. డ్వాక్రా మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలన్నారు. వ్యాపారులకు రుణాలు మంజూరు చేస్తామన్నారు. పల్లె, పట్టణ ప్రగతితో ఊళ్లకు కొత్తందం వచ్చిందన్నారు. ప్రతి గ్రామం పచ్చదనంతో పరిఢవిల్లాలన్నారు.
అనంతరం లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు అందజేశారు. మొక్కలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీసీసీ బ్యాంక్ వైస్ చైర్మన్ కుందూరు వెంకటేశ్వర్రెడ్డి, ఎంపీపీ నల్లా నాగిరెడ్డి, జడ్పీటీసీ పుస్కూరి శ్రీనివాసరావు, పాలకుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముస్కు రాంబాబు, ఎఫ్ఎస్సీఎస్ బ్యాంక్ చైర్మన్లు బొబ్బల అశోక్రెడ్డి, గోనె మైసిరెడ్డి, కారుపోతుల వేణు, సర్పంచ్లు వీరమనేని యాకాంతారావు, పసునూరి మధుసూదన్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పసునూరి నవీన్, ఏఎంసీ చైర్మన్ పేరం రాము, ఎంపీపీ జ్యోతి, గాంధీనాయక్, జడ్పీటీసీ కేలోత్ సత్తెమ్మ, రైతు బంధు సమితి బాధ్యుడు సిందె రామోజీ, డీసీవో కిరణ్ కుమార్, నాబార్డు డీడీఎం చంద్రశేఖర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ శ్రీనివాసరెడ్డి, వర్రె వెంకన్న, ఏపీడీ ఎండీ నూరొద్దీన్, సీఈవో సత్యనారాయణరెడ్డి, ఏపీఎం రమణాచారి, ఎంపీటీసీలు కుందూ రు విజయలక్ష్మి, అందె యాకయ్య, నజీర్, వెంకటేశ్వర్ రావు, సోమ రాములు తదితరులు పాల్గొన్నారు.