హనుమకొండ, సెప్టెంబర్ 26 : తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక వీరనారి చాకలి ఐలమ్మ అని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. న్యూశాయంపేట పద్మాక్షి రోడ్డులో ఆదివారం ఐలమ్మ 126వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంపీ బండా ప్రకాశ్, చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, హనుమకొండ, వరంగల్ కలెక్టర్లతో కలిసి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఐలమ్మ జయంతి వేడుకలను అధికారికంగా జరుపుకోవడం గర్వంగా ఉందన్నారు. జయంతి, వర్ధంతి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం ఆమె చేసిన పోరాటానికి నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య వంటి పోరాట యోధుల పేర్లు చెబితే పాలకులు మండిపడేవారన్నారు. ఐలమ్మ స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్ ఉద్యమాన్ని ప్రారంభించి, రాష్ర్టాన్ని సాధించారని వివరించారు. భావితరాలకు ఐలమ్మ చరిత్ర తెలిసేలా సీఎం కేసీఆర్ ప్రణాళికలు సిద్ధం చేశారన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం, పెత్తందారి వ్యవస్థపై పోరాడిన ధీరవనిత అని కొనియాడారు. తెలంగాణ మట్టిలోనే పోరాటం ఉందని, అందు కు చాకలి ఐలమ్మ జీవితం గొప్ప సందేశన్నా రు. తెలంగాణ ఉద్యమకారులు, పోరాట యోధులను ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం గొప్పగా గౌరవించుకుంటుందని వివరించారు. మరుగునపడ్డ కుల వృత్తులను వెలుగులోకి తెస్తూ ప్రోత్సహిస్తున్న మహనీయుడు కేసీఆర్ అని అన్నారు. ఢిల్లీలో కూడా ఐలమ్మ జయంతి వేడుకలను సీఎం చేతుల మీదుగా నిర్వహించడం గర్వకారణమన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న సీఎం కేసీఆర్కు అండగా ఉండాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు.
నగరంలో హైటెక్ లాండ్రీ
రజకుల కోసం నగరంలో హైటెక్ లాండ్రీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్ భాసర్ తెలిపారు. ధోబీఘాట్లు, లాండ్రీలు, సెలూన్లకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు వెల్లడించారు. కులవృత్తులను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదన్నారు. ఇక్కడ కమ్యూనిటీహాల్ ఏర్పాటు చేసి రజక మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా శిక్షణ ఇచ్చేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణ అమరులను స్మరిస్తూ గుర్తింపు ఇస్తున్నది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఉద్యమకారులకు సీఎం కేసీఆర్ గుర్తింపు ఇస్తున్నారని పేర్కొన్నారు. నగరంలో రెండు హైటెక్ లాండ్రీల పనులు కూడా ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. దీంతో వందల మంది రజకులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమకారులు, పోరాట యోధులును గుర్తిస్తున్న ఘనత సీఎం కేసీఆర్దేనని ఎంపీ బండా ప్రకాశ్ అన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ సుధీర్కుమార్, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు రాజీవ్గాంధీ హన్మంతు, బీ గోపి, గ్రేటర్ కమిషనర్ ప్రావీణ్య, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ఖాన్, కుడా అడ్వైజరీ కమిటీ మెంబర్ మాడిశెట్టి శివశంకర్, 31వ డివిజన్ కార్పొరేటర్ మామిండ్ల రాజు, రజక సంఘం చైర్మన్ డాక్టర్ మధుచందర్, సభ్యుడు అంకన్న, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.