సముద్రాలలో వ్యక్తి దారుణ హత్య
భార్య, ఆమె మేనబావే హంతకులు
వివాహేతర సంబంధమే హత్యకు కారణం
రెండు గంటల్లో ఛేదించిన పోలీసులు
స్టేషన్ఘన్పూర్, ఏప్రిల్ 21 : మండలంలోని సముద్రాల గ్రామానికి చెందిన మహ్మద్ హాజీమియా(35) అనే వ్యక్తి బుధవారం తెల్లవారుజామున దారుణ హత్యకు గురయ్యాడు. గొంతుకోసి హతమార్చారు. వివరాల్లోకి వెళితే.. సముద్రాల గ్రామానికి చెందిన మహ్మద్ హాజీమియాకు ఎనిమిదేళ్ల క్రితం పాలకుర్తి మండలం వల్మిడి గ్రామానికి చెందిన షాజహాన్తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు అమ్మాయిలు. హాజీమియా కుర్చపల్లి గ్రామానికి చెందిన చిలుకనూరి రాజు వద్ద హార్వెస్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. కాగా, షాజహాన్ పెళ్లిముందే తన మేనబావ సయ్యద్ను ప్రేమించింది. కొంతకాలంగా ఇంట్లో గొడవలు జరుగుతుండడంతో షాజహాన్ మనసు తన మేనబావ వైపు మళ్లి, వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో ఎలాగైనా హాజీమియాను అడ్డుతొలగించుకోవాలనుకున్నారు. హాజీమియా మర్డర్కు సయ్యద్ ప్లాన్వేశాడు. మద్యం బాటిల్, కత్తి బైక్లో పెట్టుకుని మద్యం తాగుదామని హాజీమియాకు ఫోన్ చేశాడు. రాత్రి 8గంటల సమయంలో సముద్రాల క్రాస్ రోడ్ వద్ద మోరీపై కూర్చొని ఇద్దరూ మద్యం తాగిన తర్వాత సయ్యద్ తన వెంట తెచ్చుకున్న కత్తితో హాజీమియా గొంతుకోసి దారుణంగా హతమార్చాడు. విషయం తెలుసుకున్న సీఐ శ్రీనివాస్రెడ్డి, ఎస్సైలు రమేశ్నాయక్, మోహన్బాబు సంఘటనా స్థలానికి చేరుకొని, క్లూస్టీం, డాగ్ స్కాడ్తో పరిశీలించారు. మృతుడి సెల్ఫోన్ కాల్స్ ఆధారంగా కేసు విచారణ చేపట్టారు. షాజహాన్, ఆమె మేనబావ సయ్యద్కు మధ్య వివాహేతర సం బంధమే హాజీమియా హత్యకు తెలుసుకుని వారిని అరెస్ట్ చేశారు. రెండు గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులను ఏసీపీ వైభవ్గైక్వాడ్ అభినందించారు.