కాజీపేట, సెప్టెంబర్ 19: కాజీపేట రైల్వే జంక్షన్ పరిధిలో త్వరలోనే వ్యాగన్ (పీవోహెచ్) షెడ్ పనులు ప్రారంభిస్తామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ హామీ ఇచ్చారని కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, డివిజన్ పోరాట సమితి తెలిపింది. ఈ మేరకు గౌరవ అధ్యక్షుడు గాదె ఇన్నయ్య ఆధ్వర్యంలో సభ్యులు వినోద్కుమార్ను హైదరాబాద్లో శనివారం రాత్రి కలిసి పలు సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా సమితి సభ్యులు ఆదివారం కాజీపేటలో విలేకరులతో మాట్లాడారు. ఇటీవల హనుమకొండ జిల్లా కలెక్టర్ ఆర్జీ హన్మంతును కలిసి రైల్వే వ్యాగన్ వర్క్షాపు గురించి అడుగగా, రైల్వేకు అప్పగించిన స్థలానికి చెందిన పాత పహాణీలు కావాలని అడుగుతున్నారని, ప్రస్తుతం జిల్లా అధికార యంత్రాంగం వద్ద అవి లేవని రైల్వే అధికారులకు చెప్పామన్నారు. కలెక్టర్గా రైల్వేశాఖ కోరిన పద్ధతిలో భూమిని అప్పగిస్తామని చెప్పినా వినడంలేదని ఆయన చెప్పారని వినోద్కుమార్కు వివరించారు. దీంతో స్పందించిన వినోద్కుమార్ జిల్లా కలెక్టర్, రైల్వే డీఆర్ఎంను రైల్వే వ్యాగన్ వర్క్ షాపు పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైల్వేశాఖకు భూమిని ఏ విధంగా అప్పగించాలన్నా ప్రభుత్వపరంగా ఆ విధంగా అప్పగిస్తామని వినోద్కుమార్ చెప్పారన్నారు. కాజీపేటలో రైల్వే వ్యాగన్ పీవోహెచ్ షెడ్ నిర్మాణానికి రైల్వే డీఆర్ఎం సానుకూలంగా స్పందించారని, త్వరలోనే టెండర్లు పిలుస్తామని హామీ ఇచ్చారని తెలిపారన్నారు. రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, డివిజన్ పోరాట సమితి నాయకులు కొండ్ర నర్సింగరావు, కర్ర యాదవరెడ్డి, దేవులపల్లి రాఘవేందర్, గోపు సోమయ్య, ప్రభు చరణ్, పాక వేద ప్రకాశ్, రవీందర్, సంజీవయ్య, జీఎస్ బాబురావు, భాస్కర్, లక్ష్మీ నారాయణ ఉన్నారు.