వనపర్తి: యాసంగి నాటికి సగం వరకు గిడ్డంగులను వినియోగంలోకి తెచ్చేలా నిర్మాణ పనులు పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆదేశించారు. సోమవారం ఖిల్లా ఘనపురం మండలంలోని వీరాయపల్లిలో నిర్మిస్తున్న గిడ్డంగుల నిర్మాణం పనులను ఘణపురం నుంచి వనపర్తి వస్తూ మార్గమధ్యలో మంత్రి నిరంజన్ రెడ్డి పరిశీలిం చారు.
రూ 9 కోట్లతో గిడ్డంగుల కార్పోరేషన్ పనులు జరుగుతున్నాయని, పది వేల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ చేసేందుకు ఈ గిడ్డంగులు ఉపయోగపడనున్నాయన్నారు. ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మిస్తున్న పనులు నాణ్యతతో చేపట్టాలని, క్యూరింగ్ పై ఏ మాత్రం నిర్లక్ష్యం వహించరాదని, గిడ్డంగులకు వెళ్లేందుకు రోడ్డును మెరుగుపరచాలన్నారు.
అంతకుముందు జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో పెబ్బేర్ మండలం రంగాపూర్ కు చెందిన జయమ్మకు చికిత్స నిమిత్తం రూ 2లక్షల విలువ గల ఎల్వోసీ, వనపర్తి గంజికి చెందిన సత్యనారాయణ సింగ్కు రూ 2.5 లక్షల చెక్కును, మరో నలుగురు లబ్దిదారులకు రూ 2లక్షల 26వేల 500 విలువ గల సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్ తదితరులు పాల్గొన్నారు.