వనపర్తి, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం అన్ని పాఠశాలల్లో ఆంగ్ల విద్యబోధన చేయాలని చేస్తున్న ప్రయత్నానికి అడుగులు పడుతున్నాయి. గ్రామీణ విద్యార్థుల తలరాత మా ర్చిన మోడల్ స్కూళ్లు మరింత బలోపేతం కానున్నాయి. సకల సౌకర్యాలతో ఏర్పాటు చేసిన పాఠశాలల్లో 6 నుంచి 12వ తరగతి వరకు విద్యాబోధన జరుగుతున్నది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 8 ఆదర్శ పాఠశాలలు ఉండగా.. వనపర్తి జిల్లాలో పెబ్బేరు, కొత్తకోట, ఖిల్లాఘణపురం మండలాల్లో ఉన్నాయి. ప్రతి తరగతికి 100 మంది చొప్పున సుమారు 500 మంది చదువుకుంటున్నారు. ఈ పాఠశాలల్లో అడ్మిషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. 6 నుంచి 10 వ తరగతి వరకు ఖాళీలను అనుసరించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొనేందుకు మార్చి 10వ తేదీ వరకు అవకాశం కల్పించింది. ఓసీ విద్యార్థులు రూ.100, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.50 రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 16, 17న ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. మే 5న ఫలితాలు వెల్లడించనున్నారు. 20వ తేదీన రోస్టర్ పద్ధతిన సెలెక్ట్ చేసిన లిస్ట్ను ప్రిన్సిపాళ్లకు అందజేస్తారు. 23న విద్యార్థుల ప్రవేశాలకు సంబంధించిన జాబితాను అదనపు కలెక్టర్ ఎంపిక చేస్తారు. 24న ఆయా పాఠశాలల్లో లిస్ట్ను జాబితాను నోటీస్ బోర్డుపై ఉంచుతారు. 24 నుంచి 31వ తేదీ వరకు విద్యార్థుల ధ్రువీకరణ పత్రాల ను పరిశీలిస్తారు. జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 4, 5వ తరగతి చదివి, ఆగస్టు 31, 2022 వరకు పదేండ్లు నిండిన విద్యార్థులు ఆరో తరగతిలో ప్రవేశం పొందొచ్చు.