రాష్ట్రంలో గుట్కా, తంబాకు, పాన్ మాసాలా వంటి మత్తు పదార్థాలను ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. దీంతో గుట్కా విక్రయదారులు ముందు కావాల్సిన ఆర్డర్ తీసుకుని మరుసటి రోజు ఆ షాపులకు నేరుగా డోర్ డెలివరీ చేస్తున్నారు. పకడ్బందీగా చేయాల్సిన అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో ఏ కిరాణం షాపును తనిఖీ చేసినా గుట్కా విచ్చల విడిగా దొరుకుతున్నది. పక్కా సమాచారం ఉంటేనే అధికారులు దాడులు నిర్వహించి కేసులు నమోదు చేస్తున్నారు. లేదంటే అటువైపే కన్నెత్తి చూడడం లేదని అధికారులపై విమర్శలు వినిపిస్తున్నాయి.
వనపర్తి, ఏప్రిల్ 10 : గుట్కా వ్యాపారులు కొత్త తరహాల ను పాటిస్తున్నారు. ఇతర వస్తువుల మార్కెటింగ్ మాదిరిగా ఆర్డర్ ఇస్తే చాలు వ్యాపారులు నేరుగా తమ వాహనాల్లో గుట్కాను సరఫరాను చేస్తున్నారు. అడపాదడపా అధికారు లు దాడులు నిర్వహిస్తున్న తరుణంలో విక్రయదారులు స్థానిక వ్యాపారుల నుంచి ఒక రోజు ముందుగానే ఆర్డర్ తీసుకుని తమ సొంత వాహనాలలో నిషేధిత గుట్కాలను డోర్ డెలివరీ చేస్తున్నట్లు తెలుస్తోంది.
జిల్లాలో పాన్ మసాలా వ్యాపారంపై అధికారుల తనిఖీ, నిఘా లేకపోవడంతో మూడుపువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతుంది. 2020 సంవత్సరంలో జిల్లాలో మొత్తం 15 పోలీస్ స్టేషన్లో 21 కేసులు నమోదు కాగా 2021 మార్చి 31వ తేదీ వరకు ఒక్క కేసు మాత్రమే నమోదు కావడం విశేషం.
ఆగని దందా..
నిషేధిత పొగాకు ఉత్పత్తుల అక్రమ దందా జిల్లాలో అదుపులోకి రావడం లేదు. ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే గుట్కాలు, ఖైనీలు, పొగా ఉత్పత్తులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించినా ఆ నిబంధనలు మాత్రం జిల్లా లో కనిపించడం లేదు. పేరుకు మాత్రమే సంవత్సరంలో రెండు, మూడు సార్లు మాత్రమే దాడులు చేయడమే తప్పా గుట్కాను అదుపు చేసే ప్రయత్నం చేయడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని 14 మండల, పట్టణ, రూరల్ పోలీస్ స్టేషన్లో చాలా వరకు కేసులు నమోదు కావడం లేదంటే నిఘా ఏ స్థాయిలో ఉందో అర్థంమవుతున్నది.
పెట్టుబడి తక్కువ.. ఆదాయం ఎక్కువ..
గుట్కా తినడం వ్యసనంగా మారిన వారి అవసరాన్ని వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. సుమారు 10 రకాల పేర్లతో సాధారణ గుట్కా, పాన్ మసాలా తయారు చేస్తారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం సంపాదించే ఆలోచనతో పలువురు ఈ గుట్కాల అమ్మకాలకు మొగ్గుచూపుతున్నారు.
దాడులు నిర్వహిస్తున్నాం..
నిషేధిత గుట్కాపై పట్టణంలో దాడులు నిర్వహిస్తున్నాం. ఈ సంవత్సరం మార్చి 19న రాయిచూర్ నుంచి తీసుకువస్తున్న రూ.25,142 విలువ గల గుట్కాను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి ఎమ్మార్వో ఎదుట బైండోవర్ చేశాం. గుట్కా విక్రయదారులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. ఎవరైనా పట్టణంలో క్రయవిక్రయాలు జరిపితే వారిపై కేసులు నమోదు చేస్తాం.