ఆత్మకూరు, జూన్ 24 : ఏరువాక పౌర్ణమి పండుగను ఆత్మకూరు, అమరచింత మండల్లాల్లో ఘనంగా నిర్వహించుకున్నారు. మండల కేంద్రాలతో పాటు వివిధ గ్రామాల్లోని రైతులు ఏరువాక పౌర్ణమి పండుగను అహ్లాదంగా జరుపుకొన్నారు. ఉదయం నుంచే గ్రామాల్లోని రైతులు తమ పశువు లు, ట్రాక్టర్లను శోభాయమానంగా అలంకరించి గ్రామా ల్లో ఊరేగించారు. సాయంత్రం వేళ ఆయా గ్రామాల్లో పశువుల పోటీలు, ఎద్దుల బండ్ల పోటీలు, ఏరువాక తాడు తెంపే పోటీలను నిర్వహించుకున్నారు. ఆయా గ్రామాల ప్రజాప్రతినిధుల సమక్షంలో జరిగిన పోటీలలో రైతులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తిప్డంపల్లి, మూలమల్ల, అమరచింత, గోపన్పేట, నందిమల్ల, జూరాల, ఆరెపల్లి తదితర గ్రామాల్లో రైతులు ఏరువాక పోటీలను ఘనంగా జరుపుకొన్నారు. ఆయా పోటీల్లో గెలుపొందిన పశువుల జంటకు, రైతులకు ప్రోత్సాహక బహుమతులను సహితం అందించారు. కార్యక్రమాల్లో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఏరువాక పౌర్ణమి వేడుకల్లో అపశృతి
ఏరువాక పౌర్ణమి సందర్భంగా గురువారం మండలంలోని దుప్పల్లి గ్రామంలో నిర్వహించిన వేడుకల్లో అపశృతి చోటు చేసుకున్నది. గ్రామస్తుల కథనం ప్రకారం ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకొని గ్రామంలో రైతులు వేడుకలు నిర్వహించారు. ఎద్దుల బండ్లను అందంగా అలంకరించి, ఎద్దులకు రంగులు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రధాన చౌరస్తాలో రెండు స్తంభాలకు మామిడి తోరణం కట్టి, ఎద్దుల బండ్లతో తోరణాన్ని అందుకునే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో తోరణానికి తాడువేసి అందుకునే క్రమంలో ఒక్కసారిగా స్తంభం విరిగి పడిపోయిందని తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిపారు.